IPL: గత రెండు సీజన్లుగా సన్రైజర్స్ హైదరాబాద్ తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. జట్టు ఎలా ఉన్నా కెప్టెన్ విషయంలో మాత్రం సన్రైజర్స్ ఇరకాటం పడిందనే చెప్పాలి. 2021 సీజన్లో డేవిడ్ వార్నర్ను అర్ధాంతరంగా కెప్టెన్సీ నుంచి తొలగించి విలియమ్సన్కు సన్రైజర్స్ యాజమాన్యం పగ్గాలను అప్పగించింది. 2022 సీజన్లో ఏకంగా వార్నర్ను జట్టు నుంచి విడుదల చేసింది. దీంతో గత సీజన్లో విలియమ్సన్ పూర్తి స్థాయిలో నాయకత్వ బాధ్యతలను స్వీకరించాడు.
అయితే అనూహ్యంగా వచ్చే సీజన్ కోసం విలియమ్సన్ను సన్రైజర్స్ రిటైన్ చేసుకోకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. చివరకు మినీ వేలంలో అతడిని దక్కించుకోలేకపోయింది. దీంతో సన్రైజర్స్ టీమ్కు కొత్త కెప్టెన్ ఎవరు అన్న విషయం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే ఇటీవల వేలంలో పంజాబ్ కింగ్స్ సారథి మయాంక్ అగర్వాల్ను కొనుగోలు చేసిన సన్రైజర్స్.. తమ తదుపరి కెప్టెన్గా అతన్నే నియమించే అవకాశం ఉంది.
కానీ ఇప్పటివరకు తమ కెప్టెన్ను సన్రైజర్స్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే మయాంక్తో పాటు మరో ఇద్దరు కూడా సన్రైజర్స్ కెప్టెన్ రేసులో ఉన్నారని తెలుస్తోంది. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఎయిడెన్ మార్క్రమ్, టీమిండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కెప్టెన్సీ రేసులో ఉన్నారు. గత సీజన్లో విలియమ్సన్ కొన్ని మ్యాచ్లకు దూరంగా కాగా భువనేశ్వర్ ముందుండి నడిపించాడు. మరి వచ్చే సీజన్లో ఈ ముగ్గురు ఆటగాళ్లలో సన్రైజర్స్ యాజమాన్యం ఎవరికి ఓటు వేస్తుందో చూడాలి.
బలంగా మారిన స్పిన్ విభాగం
గత సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు స్పిన్ విభాగం మిగిలిన జట్లతో పోలిస్తే బలహీనంగా ఉంది. రషీద్ ఖాన్ను వదిలేసుకున్న తర్వాత ఆ స్థాయి ప్లేయర్ను తీసుకోలేకపోయింది. వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్లతో స్పిన్ విభాగాన్ని నెట్టుకొచ్చింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2023లో ఆదిల్ రషీద్, మయాంక్ మార్కండే, అకీల్ హోస్సెన్లను తీసుకుని స్పిన్ విభాగాన్ని పటిష్టం చేసుకుంది.