Undavalli Sridevi – Dokka Manikya Vara Prasad :గుంటూరు జిల్లాకు చెందిన తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యవహారం ఇప్పుడు ఆ పార్టీలో దుమారం రేపుతోంది. శ్రీదేవి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆదే నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ కు నియోజకవర్గ సమన్వయకర్తగా అదనపు బాధ్యతలు అప్పగించడం వైసీపీలో కాక రేపుతోంది. దీనిపై శ్రీదేవితో పాటు ఆమె అనుచరులు, వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అధిష్టానం నుంచి అధికారికంగా ప్రకటన రాగానే అర్థరాత్రి హోమంత్రి సుచరిత ఇంటి ముందు శ్రీదేవితో సహా ఆమె వర్గీయులు ఆందోళనకు దిగారు. జగన్ తో మాట్లాడతానని సుచరిత హామీ ఇవ్వడంతో శ్రీదేవి వెనక్కి తగ్గారు.
అయితే శ్రీదేవి వ్యవహారంపై వైసీపీ అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. హోంమంత్రి ఇంటి ముందు పార్టీకి వ్యతిరేకంగా ఆందోళన చేయడంపై వైసీపీ పెద్దలు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె వ్యవహారశైలి సరిగ్గా లేదని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. వైసీపీ అధిష్టానం నిర్ణయం మార్చుకోకపోతే నాలుగు మండలాల్లోని వైసీపీ నేతలు రాజీనామా చేస్తారని శ్రీదేవి బెదిరింపులకు దిగడంపై వైసీపీ హైకమాండ్ గుర్రుగా ఉంది. డొక్కాను నియమించడంతో ఎట్టకేలకు శ్రీదేవికి చెక్ పెట్టినట్లే అర్థమవుతుంది. డొక్కాను నియోజకవర్గ ఇంచార్జ్ గా నియమించడంతో వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇచ్చేది లేదని వైసీపీ హైకమాండ్ ఓపెన్ గా చెప్పినట్లు అయింది.
దీంతో శ్రీదేవి వైసీపీలో కొనసాగుతారా? లేదా? అనేది ఇప్పుడు వైసీపీలో చర్చనీయాంశమైంది. ఆమె వేరే పార్టీలోకి వెళతారా? అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఐప్యాక్ సర్వేలో తాడికొండ నియోజకవర్గంలో శ్రీదేవి గ్రాఫ్ తగ్గిందని, వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇస్తే గెలిచే అవకాశం లేదని తేలిందట. అందువల్లే శ్రీదేవిని పక్కన పెట్టాలనే ఆలోచనకు వైసీపీ వచ్చిందట. అందువల్లే నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్య వరప్రసాద్ ను నియమించిందని అంటున్నారు.
ఇలా చాలామంది ఎమ్మెల్యేల పరిస్థితి ఇలాగే ఉందని, ఐప్యాక్ సర్వేలో నెగిటివ్ ఫలితాలు వచ్చినట్లు వైసీపీలో ప్రచారం జరిగింది. త్వరలో వారికి కూడా శ్రీదేవి తరహాలోనే చెక్ పెట్టే అవకాశముందని తెలుస్తోంది. వారి స్థానంలో కొత్త వారికి నియోజకర్గ సమన్వయకర్తగా అవకాశమిచ్చి వచ్చే ఎన్నికల్లో పోటీలోకి దింపనున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఐప్యాక్ సర్వేలో దాదాపు 30 మంది ఎమ్మెల్యేలపై నియోజకవర్గాల్లో వ్యతిరేక ఉందట. వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్ దక్కడం కష్టమేనని అంటున్నారు. వారి స్థానాల్లో కొత్త వారికి అవకాశం కల్పించే యోచనలో జగన్ ఉన్నారు.
వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచి అధికారాన్ని చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో జగన్ ఇప్పటినుంచే కసరత్తులు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటినుంచే దృష్టి సారించారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు. ఐప్యాక్ సర్వేలను తెప్పించుకుని వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను పక్కన పెట్టేస్తున్నారు. వారి ప్లేస్ లో ప్రత్యామ్నాయ నేతలను, గెలవగలిగే నేతలను తెరపైకి తీసుకొస్తున్నారు. ఉండవల్లి శ్రీదేవిని పక్కన పెట్టడం వెనుక అదే కారణంగా తెలుస్తోంది.