Pawan: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడడంతో పాటు సంచలన వ్యాఖ్యలు చేస్తూ లేనిపోని కాంట్రవర్సీలను కొని తెచ్చుకుంటున్నారు. ఆవేశంలో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్. అంతేకాకుండా కులాల గురించి మతాల గురించి ప్రస్తావన తీసుకువస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ కులాల గురించి మతాల గురించి వ్యాఖ్యలు చేయడంతో నెటిజెన్స్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. కాగా తాజాగా పవన్కల్యాణ్ మతం ప్రాతిపదికన ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నాల్ని చూస్తుంటే, అసహ్యం వేస్తోందనే విమర్శ వెల్లువెత్తుతోంది.
తాజాగా పశ్చిమగోదావరి జిల్లా తణుకు బహిరంగ సభలో పవన్ ఈ దఫా హిందూ మతాన్ని అడ్డు పెట్టుకుని జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నించారు. సీఎం వైఎస్ జగన్ ఫ్యామిలీ క్రిస్టియన్ మతాన్ని విశ్వసించడాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆయనపై మత పరంగా విద్వేషాన్ని వెళ్లగక్కారు. మన సమాజంలో అత్యధికులు హిందువులు కావడంతో, వారి విశ్వాసాలను జగన్ అవమానిస్తున్నారనే ప్రచారానికి తెరలేపడం గమనార్హం. ముఖ్యమంత్రి జగన్, వైసీపీ నాయకులు హిందూ మతాన్ని అగౌరపరుస్తున్నారని పవన్ అన్నారు.
వైసీపీ పాలనలోనే రామతీర్థం విగ్రహాలను నరికేశారని, అంతర్వేదిలో రథం తగలబెట్టినా పట్టించుకున్న నాథుడే లేడని ఆయన వాపోయారు. ఇప్పుడు అన్నవరంలో పురోహితులకు వేలం పాట పెట్టారని ధ్వజమెత్తారు. జగన్ ఇదే పని ఇస్లాం మతంలో చేయగలవా? క్రైస్తవుల చర్చిల్లో కూడా అమలు చేస్తావా? అంటూ మైనార్టీలను కూడా ఈ వివాదాల్లోకి లాగారు. ముస్లిం, క్రిస్టియన్ మతాలకు అనుకూలంగా పని చేస్తున్నారని చెప్పడం ద్వారా హిందువుల వ్యతిరేకిగా జగన్ను చిత్రీకరించేందుకు ఎలాంటి బెరుకు లేకుండా నేరుగా బహిరంగ విమర్శలకే దిగారు. హిందూ దేవాలయాలపై ఎందుకు పడ్డావని ఒక బీజేపీ నాయకుడిలా ప్రశ్నించారు. కాషాయం కప్పుకున్న బీజేపీ నాయకుడి అవతారం ఎత్తి హిందూ ధర్మం అంటే అంత చులకనా? అంటూ జగన్ను నిలదీశారు పవన్.. అలాగే హిందువుల జోలికొచ్చి పిచ్చి వేషాలు వేయడానికి నువ్వు, నీ మంత్రులు ఎవరు? నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే జనసేన చూస్తూ ఊరుకోదంటూ హెచ్చరించాడు. కులాలని కలిపే ఆలోచనా విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం చేస్తానని తన పార్టీ సిద్ధాంతాలుగా చెప్పుకునే పవన్ నోటి నుంచి ఇలాంటి విమర్శలు రావడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలో ఏపీ రాజకీయాల్లో మతం కేంద్రంగా రాజకీయం చేసిన నాయకులను చూడలేదు. ఇప్పుడు పవన్ పుణ్యమా అని ఆ లోటు కూడా తీరిపోయింది.
పవన్కల్యాణ్ మత రాజకీయాలపై పౌర సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సమాజానికి పవన్ మంచి చేయకపోయినా, మతం, కులం పేర్లతో విద్వేషాలను నింపొద్దని పౌర సమాజం వేడుకుంటోంది.