Jr NTR: తెలుగు సినీ చరిత్రలో ఓ వెలుగు వెలిగిన ధృవతార విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు. సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఆయన శత జయంతి ఉత్సావాలను అభిమానులు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఓ గ్రాండ్ ఈవెంట్ను నిర్వహించబోతున్నారు. అయితే ఈ స్పెషల్ ఈవెంట్కు జూనియర్ ఎన్టీఆర్ గైర్హాజరు అవుతున్నారని తెలిసింది. ఆయన రాకపోవటానికి గల కారణాలు ఈ విధంగా ఉన్నాయి.
నట విశ్వరూపం నందమూరి తారక రామారావు మే 28వ తేదీకి 100వ జయంతిని పూర్తి చేసుకోబోతున్నారు. గత ఏడాది నుంచే నందమూరి అభిమానులు ఆయన శతజయంతి ఉత్సవాలను జరుపుతున్నారు. దీని పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలను సైతం జరుపుతున్నారు. ఇందులో భాగంగానే కొద్ది రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్లో ఓ ఈవెంట్ను నిర్వహించి రజినీకాంత్ను పిలిచారు.
ఇక కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులోని కైతలాపూర్ మైదానంలో ఓ భారీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ప్రత్యేక అతిథిగా ఎన్టీఆర్ తనయుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హాజరు కానున్నారు.
అయితే జూనియర్ ఈ వేడుకలకు గైర్హాజరు కాబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఎన్టీఆర్ టీం ప్రకటన చేసింది. మే 20వ తేదీన హైదరాబాద్లో జరగనున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరు కావడం లేదని తెలిపింది. అదే రోజున జూనియర్ ఎన్టీఆర్ 40వ జన్మదినోత్సవం జరుపుకోవడంతో పాటు అంతకుముందే కుటుంబ సభ్యులతో ప్రణాళిక చేసుకున్న కమిట్ మెంట్స్ వల్ల ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని తెలిపింది. ఈ విషయంపై సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరీ.