KTR: ఉద్యమ గడ్డ తెలంగాణపై మళ్లీ ఎన్నికల వేడి రాజేసుకుంది. బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉన్న వార్.. ఇప్పుడు బీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్యకు వచ్చేసింది. బీజేపీకి అంత సీన్ లేదని తెలిసి, బీజేపీ నాయకులు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు ఈ సందర్భంగా ఉత్సుకత చూపుతున్నారు. మరోవైపు కల్వకుంట్ల ఫ్యామిలీ సైతం కాంగ్రెస్ పై అస్త్రాలు సందిస్తోంది. తాజా ఇంటర్వ్యూలో కేటీఆర్, కాంగ్రెస్, బీజేపీకి సవాల్ విసిరారు.
తెలంగాణలో రసకందాయకంగా రాజకీయ క్రీడ మారింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో హైఓల్టేజ్ లో పాలిటిక్స్ పీక్స్ కి చేరాయి. ఏ స్టేజ్ ఎక్కినా, సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, తలసాని, ఎర్రబెల్లి, మల్లారెడ్డి సహా ఇతర నాయకులు కాంగ్రెస్ ని టార్గెజ్ చేసి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీని సైతం కలుపి తిడుతున్నారు. తాజాగా ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలోనూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేసి, రెండు పార్టీలకు సవాల్ విసిరారు.
ఈ 9 ఏళ్ళలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి వివరించి తమను కాదనడానికి ఒక్క కారణం చెప్పాలని కేటీఆర్ ప్రతిపక్షాలకు సవాలు విసిరారు. తమ పార్టీ బీజేపీకి బీ-టీమ్ అని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ఆయన బలంగా తిప్పి కొట్టారు. నిజానికి కాంగ్రెస్ పార్టీయే బీజేపీకి బీ-టీమ్ అన్నారు. రాహుల్ గాంధీ వంటి అసమర్ద నాయకుడున్న కాంగ్రెస్ పార్టీ తమకు ఎప్పటికీ ప్రత్యర్ధిగా ఉండాలని బీజేపీ కోరుకొంటోందన్నారు.
తాము ఈడీ, మోడీ, బోడిలను చూసి భయపడబోమని స్పష్టం చేశారు. ఎవరు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీలకు సవాల్ విసిరారు. మా ముఖ్యమంత్రి కేసీఆర్. మరి మీ పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరో ప్రకటించగలన్నారు. దీంతో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు డైలమాలో పడ్డాయని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు.