Viveka: తండ్రిని చంపిన వాళ్లని ఎలాగైనా జైలుకి పంపించాలన్న వైఎస్ సునీత ఆకాంక్ష కొంతవరకైనా తీరిందని చెప్పొచ్చు. అందుకు కారణం తాజాగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ని తెలంగాణ హైకోర్టు రద్దు చేయడం.
ఈ మేరకు ఎర్ర గంగిరెడ్డిని వచ్చే నెల 5వ తేదీలోగా హైదరాబాద్ సీబీఐ కోర్టులో లొంగిపోవాలని, లేనిపక్షంలో అతనిని అరెస్టు చేయవచ్చని సీబీఐ కి తెలిపింది హైకోర్టు. ఎర్ర గంగిరెడ్డి ప్రస్తుతం బెయిల్ పై పులివెందులలో కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. కేసుకి సహకరించడం లేదని, సాక్షులని ప్రభావితం చేస్తున్నాడని సిబిఐ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ కేసుని సిబిఐ విచారణ రెండు నెలల్లో పూర్తి చేయాలని జూన్ 30 వరకు మాత్రమే గంగిరెడ్డి బెయిల్ రద్దు చేస్తామని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.ఎర్ర గంగిరెడ్డి సాక్షులని ప్రభావితం చేయటం లేదని అయినా ఇప్పటికే 72 సార్లు సిబిఐ విచారణకు హాజరయ్యారని ఆయన తరపున న్యాయవాదులు పేర్కొన్నారు.
కానీ హైకోర్టు మాత్రం తన అభిప్రాయాన్ని సిబిఐ వాదనతోనే ఏకీభవించి గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసింది. వివేక హత్య కేసుని గతంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీట్ విచారణ జరిపింది. 90 రోజులు గడిచిపోయిన గంగిరెడ్డి పై సీట్ అఫిడవిట్ దాఖలు చేయలేదు.
రూల్స్ ప్రకారం నిందితులపై 90 రోజుల్లోగా ఆఫిడవిట్ దాఖలు చేయలేని పక్షంలో సాంకేతిక కారణాలతో బెయిల్ లభిస్తుంది. ఈ పాయింట్ తోనే గంగిరెడ్డి బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చారు. 2019 జూన్ 27న పులివెందుల కోర్టు గంగిరెడ్డి కి బెయిల్ మంజూరు చేసింది.
గంగిరెడ్డి కనుక అరెస్ట్ అయితే, వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకుంటుంది. గంగిరెడ్డి కి బెయిల్ రద్దు చేయడం వలన ఇటు సీబీఐ కి అటు వివేకానంద కుమార్తె సునీతకి కాస్త ఊరట లభించిందని చెప్పొచ్చు.