Raghurama Krishnam Raju: తాజాగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అవినాష్ రెడ్డి అరెస్టును మరిచిపోవాల్సిందే అంటూ సంచలన కామెంట్స్ చేశారు. అవినాష్ కి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ, వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై తాజాగా విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణకు సీబీఐ హాజరయ్యేలా ఆదేశించాలని డాక్టర్ సునీత కోరడం పై సుప్రీంకోర్టు బెంచ్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
అది తమ పని కాదని తేల్చి చెప్పింది. విచారణ చేయాలా? వద్దా? అనేది సీబీఐ చూసుకుంటుందని స్పష్టం చేసింది. అవినాష్రెడ్డిని అరెస్ట్ చేయాలా? వద్దా? అనేది సీబీఐ చూసుకుంటుందని ధర్మాసనం తెలిపింది. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు సీబీఐ విచారణ, అవినాష్రెడ్డి అరెస్ట్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత నెలాఖరులో అవినాష్ కి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయగా, రెండు వారాలు అయిన సుప్రీంకోర్టును సీబీఐ ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించారు.
ఇదే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడికి ఢిల్లీ హైకోర్టు లిక్కర్ కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వగా, ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతిని ఆయన గుర్తు చేశారు. ఒకవేళ ఈ నెల 19న డాక్టర్ సునీతకు సుప్రీంకోర్టులో ఊరట లభించినా, అదంతా సాంకేతిక అంశంగానే ఆయన చెప్పుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీబీఐ అవినాష్రెడ్డిని అరెస్ట్ చేసే పరిస్థితి కనిపించడం లేదని తేల్చి చెప్పారు. రామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో పాటు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. నిజంగానే ఆయన అన్నట్టుగానే జరుగుతుందా లేదా అన్నది చూడాలి మరి.