Ambati Rayudu: టీమిండియా మాజీ క్రికెటర్,చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ అంబటి రాయుడు ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే అతడు ఏపీ రాజకీయాల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇవాళ తాజాగా మే 11న తాడేపల్లిలోని సీఎం నివాసంలో కలిసారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, క్రీడారంగంలో యువతకు అవకాశాలు, శిక్షణ తదితర అంశాలపై రాయుడు సీఎం జగన్తో చర్చించారు.
అంతేకాకుండా ఇటీవల రాయుడు సీఎం జగన్పై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. జగన్ స్పీచ్ ను షేర్ చేసి గ్రేట్ స్పీచ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మీ మీద పూర్తి నమ్మకం, ఆత్మవిశ్వాసంతో ఉన్నారు అంటూ రాయుడు ట్వీట్ చేశాడు. గతంలో శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టుకు జగన్ శంకుస్థాపన చేసిన సమయంలో కూడా ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించిన వీడియోని షేర్ చేసాడు అంబటి రాయుడు. తాజాగా క్యాంపు కార్యాలయానికి వచ్చి జగన్ను కలవడంతో ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.
ఈ సందర్భంగా సీఎం జగన్ రాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. ఇకపోతే 2019లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన అంబటి రాయుడు ప్రస్తుతం ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఏది ఏమైనప్పటికీ రాయుడు రాజకీయ ఎంట్రీ పై సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలపై రాయుడు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.