Ap politics: తాజాగా సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కె. నారాయణ ఏపీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పొత్తులు కుదుర్చుకుంటాయని నారాయణ జోస్యం చెప్పారు. అంతే కాకుండా మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే మళ్లీ వైఎస్ జగనే సీఎం అవుతారు అంటూ సంచలన ప్రకటన చేశారు. కాగా ఇటీవల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. తాము టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తాం అని ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే ఈ ప్రకటన ఇంకా సజీవంగా ఉండగానే ఆయన వాఖ్యలకు పూర్తి విరుద్ధంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మాములుగా నారాయణ మనసులో ఏదో దాచుకోరు. మనసులో ఏది ఉన్నా కుండ బద్దలు కొట్టినట్టు ఏదయినా ముఖం మీదే చెప్పేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ రాజకీయాలపై తన అభిప్రాయాల్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం ఆ మూడు పార్టీలకు షాక్ ఇచ్చేలా ఉంది. బీజేపీపై ఏపీలో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఆ వ్యతిరేకత మూడు పార్టీల కూటమిపై తప్పక పడుతుందని ఆయన హెచ్చరించారు. దీంతో బీజేపీ వ్యతిరేకులంతా వైసీపీకి ఓట్లు వేస్తారని తెలిపారు నారాయణ.
మరి ముఖ్యంగా ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులు వైసీపీకి బలమైన ఓటు బ్యాంక్గా నిలుస్తారని అన్నారు. దీంతో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని నారాయణ స్పష్టం చేశారు. కాగా మరోవైపు ఇటీవల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బీజేపీతో జత కట్టొద్దని జనసేనాని పవన్ కల్యాణ్కు సూచించినట్లు వార్తలు వినిపించాయి. మొత్తానికి సీపీఐ నారాయణ చేసిన వాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.