Jasprit Bumrah: టీమిండియాకు శుభవార్త అందింది. గాయం నుంచి కోలుకున్న స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా శ్రీలంకతో వన్డే సిరీస్కు ఎంపికయ్యాడు. గతంలో మహ్మద్ సిరాజ్, షమీ, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్లను సెలక్టర్లు ఎంపిక చేయగా ఇప్పుడు వారితో పాటు బుమ్రా కూడా ఆడనున్నాడు. దీంతో హార్దిక్ పాండ్యాతో కలుపుకుంటే టీమిండియాకు ఆరుగురు పేస్ బౌలర్లు అందుబాటులో ఉండనున్నారు. గాయం కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా పూర్తి బెంగళూరులోని ఎన్సీఏలో పూర్తి ఫిట్నెస్ సాధించడంతో లంకతో వన్డే సిరీస్కు ఎంపికయ్యాడు.
2019 నుంచి బుమ్రా వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. 2022లో వెన్ను సమస్య కారణంగానే అతడు ఆసియా కప్ ఆడలేకపోయాడు. అయితే టీ20 వరల్డ్ కప్ కోసం ప్రకటించిన జట్టులో బుమ్రా పేరును బీసీసీఐ చేర్చింది. టోర్నీ ప్రారంభం నాటికి అతడు ఫిట్నెస్ సాధిస్తాడని భావించింది. అంతకంటే ముందు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు కూడా ఎంపిక చేసింది. కానీ గాయం మళ్లీ తిరగబెట్టడంతో బుమ్రా ఆటకు దూరమయ్యాడు. టీ20 ప్రపంచకప్కు కూడా అందుబాటులో లేడు. దీంతో అతడి స్థానంలో సెలక్టర్లు షమీని ఎంపిక చేశారు.
ఇటీవల గాయం నుంచి కోలుకున్న బుమ్రా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లి ఫిట్నెస్ నిరూపించుకున్నాడు. అయితే స్వదేశంలో ఆస్ట్రేలియాతో కీలకమైన టెస్ట్ సిరీస్, వన్డే సిరీస్ ఉన్న నేపథ్యంలో బుమ్రాను నేరుగా దింపడం కరెక్ట్ కాదని భావించిన బీసీసీఐ శ్రీలంకతో వన్డే సిరీస్కు ఎంపిక చేసింది. ఒకవేళ ఈ సిరీస్లో బుమ్రా రాణిస్తే ఆసీస్తో సిరీస్కు టీమిండియా బౌలింగ్ విభాగం బలోపేతం అవుతుంది.
బుమ్రాకు ప్రాక్టీస్గా శ్రీలంకతో వన్డే సిరీస్
శ్రీలంకతో వన్డే సిరీస్లో బుమ్రా బరిలోకి దిగితే ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్కు ముందు అతడికి ప్రాక్టీస్లా ఉపయోగపడనుంది. భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ జనవరి 10న ప్రారంభం కానుంది. తొలి వన్డే జనవరి 10న గౌహతిలో, రెండో వన్డే జనవరి 12న కోల్కతాలో, మూడో వన్డే జనవరి 15న తిరువనంతపురంలో జరగనున్నాయి.