Kohli: టీమిండియా రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఫేస్బుక్లో విరాట్ కోహ్లీ ఫాలోవర్ల సంఖ్య 50 మిలియన్లకు చేరింది. దీంతో ట్విటర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మూడు సోషల్ మీడియా ఖాతాలలో 50 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్న తొలి క్రికెటర్గా కోహ్లీ రికార్డులకెక్కాడు. గతంలోనే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లలో కోహ్లీకి 50 మిలియన్ ఫాలోవర్లు ఉండగా తాజాగా ఫేస్బుక్లో కూడా అతడు 50 మిలియన్ ఫాలోవర్ల మార్కును దాటాడు.
ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పరంగా పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో 505 మిలియన్ల ఫాలోవర్లతో తొలి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ 381 మిలియన్ ఫాలోవర్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ ఖాతాలో 221 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. మరో ఫుట్బాల్ స్టార్ నేయ్మార్ జూనియర్ 187 మిలియన్ ఫాలోవర్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
ఇప్పటికే పరుగులు, శతకాలు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్లు, అత్యధిక ఫోర్లు వంటి లెక్కలేనన్ని రికార్డులు కోహ్లీ పేరిట ఉన్నాయి. అలాంటి కోహ్లీకి భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలోనూ అతడికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అందుకే కోహ్లీ పెట్టే పోస్టుల కోసం నెటిజన్లు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అతడి రికార్డుల పరంపర కొనసాగుతోంది.
టీ20 ప్రపంచకప్లో రికార్డులే రికార్డులు
ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్లో మరిన్ని రికార్డులు విరాట్ కోహ్లీ ఖాతాలో చేరాయి. అంతర్జాతీయ టీ20ల్లో 4 వేల పరుగులు బాదిన తొలి బ్యాటర్గా కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్లో ఇప్పటివరకు 115 మ్యాచ్ల్లో 4008 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 36 అర్ధ శతకాలు ఉన్నాయి. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 3853 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.