Komatireddy Rajgopal: మునుగోడు ఉపఎన్నిక ముగిసినా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య విమర్శల యుద్దం ఆగలేదు. నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి జగదీశ్ రెడ్డి మధ్య మాటల యుద్దం జరుగుతూనే ఉంది. మునుగోడు ఉపఎన్నికతో మొదలైన మాటల తూటాలు ఇంకా వీరిద్దరి మధ్య కొనసాగుతూనే ఉన్నాయి.
తాజాగా మంత్రి జగదీశ్ రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. తనను మునుగోడులో ఓడించారని, వచ్చే ఎన్నికల్లో తాను సూర్యాపేటలో ఆయనను ఓడిస్తానంటూ ఛాలెంజ్ చేశారు. మునుగోడు నుంచి గ్రామానికి 10 మంది సూర్యాపేటకు వస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆయన సొంత నియోజకవర్గంలోనే ఆయనను ఓడిస్తామంటూ చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో సూర్యాపేటలో జగదీశ్ రెడ్డి గెలిపి చూపించాలని సవాల్ విసిరారు. తనను మునుగోడులో ఎలా అయితే ఓడించారో.. జగదీశ్ రెడ్డిని కూడా అలాగే ఓడింస్తానంటూ రాజగోపాల్ రెడ్డి చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో అయినా మునుగోడు ప్రజలు తనను గెలిపిస్తారనే నమ్మకం తనకు ఉందని రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గ్రామానికి 10 మంది నాయకులను పెట్టి తనను మునుగోడులో ఓడించారని, వచ్చే ఎన్నికల్లో జగదీశ్ రెడ్డిని కూడా అలాగే ఓడిస్తామన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు బలప్రయోగంతో వచ్చింది తప్ప ప్రజలు ప్రేమతో ఓటు వేయలేదని వ్యాఖ్యానించారు.
వచ్చే ఎన్నికల్లోప్రచారం చేయకుండానే తాను గెలుస్తానంటూ రాజగోపాల్ రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ కు మందులో సోడా కలిపేందుకే మంత్రి జగదీశ్ రెడ్డి పనికి వస్తారంటూ రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో ఇంటిని నిర్మించుకుని ఇక్కడ ఉండబోతున్నట్లు తెలిపారు. తాను ఓడిపోయినా, గెలిచినా ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటాన్నారు అవినీతి సొమ్మును పంచి పెట్టి టీఆర్ఎస్ గెలిచిందని ఆరోపించారు. మునుగోడు నియోజకవర్గం పేరు దేశం మొత్తం వినిపించేలా తాను చేశానన్నారు.