KTR: తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ మహబూబ్ నగర్ లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణ జీవ నదులతో జీవం లేని పాలమూరుకు జీవం పోస్తున్నాము. ఒకప్పుడు పాలమూరు అంటే మైగ్రేషన్ అని ఇప్పుడు ఇరిగేషన్ అని తెలిపారు కేటీఆర్. పాలమూరు పచ్చబడుతున్న కొద్ది కొంతమంది కళ్ళు మండుతున్నాయని తెలిపారు. బీజేపి రాష్ట్ర అధ్యక్షున్ని మంచోడు అనాలో లేక పిచ్చోడు అనాలో తెలియడం లేదని అన్నారు.
పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ నేతలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు అంటూ మండిపడ్డారు. గుజరాత్ వాళ్ల చెప్పులు మోసే గులాములు రాష్ట్ర బీజేపీలో ఉండడం సిగ్గుచేటన్నారు. అంతే కాకుండా మోడీ పెద్దనోట్ల రద్దుతో పేదల నడ్డి విరిచాడని విమర్శించారు. కర్ణాటక, మహారాష్ట్రలో ఎమ్మెల్యే
లను కొని పార్టీలను చీల్చి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల ఆదాయాన్ని డబుల్ చెయ్యని మోడీ అదానీ ఆదాయాన్ని లక్ష రెట్లు పెంచాడని ఆరోపించారు.
అదాని సంపాదన నుంచి బీజేపీ చందాలు తీసుకుని అడ్డమైన దందాలు చేస్తోంది అంటూ ఆరోపించారు కేటీఆర్. కృష్ణా నదిలో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను పంచేందుకు కూడా మోడీకి సమయం లేదంటూ మండిపడ్డారు. కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అని బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. రైతులను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నామని, 75 ఏళ్లలో ఏ నాయకుడు ఆలోచించని విధంగా వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది అంటూ గొప్పలు చెప్పుకున్నారు. పాలమూరులో ఎక్కడికక్కడ పచ్చని పంటలు పండుతున్నాయని చెప్పారు.