Chain Snatching: ప్రస్తుత కాలంలో డబ్బులు దోచుకోవాలనే ఆశతో చాలా మంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. వయసు భేదం లేకుండా చోరీలకు పాల్పడుతూ ఇతరుల చేతుల్లో దేహశుద్ధికి గురవుతున్నారు. ఒకప్పుడు పురుషులు మాత్రమే దొంగతనాలకు పాల్పడేవారు. కానీ.. ఇప్పుడు మహిళలు సైతం చోరీ చేసి జైలు శిక్షలు అనుభవిస్తున్నారు. బహిరంగ సభలు, ఇతరాత్ర కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు అక్కడ జనసందోహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తాజాగా చైన్ స్నాచింగ్లు మరీ ఎక్కువైపోయాయి. నడుచుకుంటూ వెళ్తున్న మహిళలు, ఇళ్ల ముందు ఆడుకుంటున్న చిన్నారుల మెడలో నుంచి బంగారు గొలుసులు లాక్కెళ్తున్నారు.
తాజాగా చైన్ స్నాచింగ్కు పాల్పడుతూ పట్టుబడ్డ మహిళను స్థానికులు పట్టుకుని చితకబాది∙ఆమెను పోలీసులకు అప్పగించిన ఘటన దొడ్డ తాలూకా మధురె గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ఇలా ఉన్నాయి.. బెంగళూరులోని హెసరఘట్ట గ్రామానికి చెందిన రాజమ్మ అనే వృద్ధురాలు పని నిమిత్తం మధురె గ్రామానికి వచ్చింది. పని ముగించుకుని బస్సు కోసం మధురె గ్రామం బస్టాప్లో ఎదురుచూస్తుండగా బైక్పై వచ్చిన ఒక మహిళ, మరో వ్యక్తి తాము దంపతులమని చెప్పుకుని రాజమ్మతో మాటలు కలిపారు.
కాసేపటి తర్వాత హఠాత్తుగా ఆ మహిళ రాజమ్మ మెడలోని బంగారు గొలుసు తెంపుకుని పరారవడానికి ప్రయత్నించింది. అయితే అప్పుడు అక్కడికి కొంతమంది రావడం గమనించి బైక్పై పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఆ మహిళ కిందపడిపోగా అతడు బైక్పై పారిపోయాడు. పట్టుబడ్డ మహిళను చితకబాదిన స్థానికులు అనంతరం ఆమెను పోలీసులకు అప్పగించారు. పట్టుబడ్డ మహిళ పేరు నందినిగా తెలిసింది. పరారైన మరోవ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.