Siraj: శ్రీలంకతో వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేయడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆనందం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా హైదరాబాదీ ఆటగాడు మహ్మద్ సిరాజ్ బౌలింగ్పై ప్రశంసలు కురిపించాడు. మూడో వన్డేలో సిరాజ్ బౌలింగ్లో వాడి చూసి స్లిప్ కార్డాన్ పెట్టాలని భావించానని.. వన్డేల్లో ఇలా స్లిప్లో ఫీల్డర్లను అరుదుగా చూస్తుంటామని రోహిత్ అన్నాడు. సిరాజ్ అసాధారణ బౌలింగ్తో ఆకట్టుకున్నాడని.. స్లిప్లో అతడు సాధించిన వికెట్లన్నింటికీ అర్హుడు అని పేర్కొన్నాడు.
గత కొన్నేళ్లుగా సిరాజ్లో ఎంతో మార్పు వచ్చిందని కెప్టెన్ రోహిత్ అభిప్రాయపడ్డాడు. రోజురోజుకు అతడు రాటుదేలుతున్నాడని.. బంతిని చక్కగా స్వింగ్ చేస్తున్నాడని కొనియాడాడు. బంతితో సిరాజ్ పరిగెత్తుతుంటే అతడిలో కాన్ఫిడెన్స్ కనిపిస్తోందని తెలిపాడు. కొత్త కొత్త ట్రిక్స్ ప్లే చేసి పవర్ ప్లేలో జట్టుకు సిరాజ్ విజయాలు అందిస్తున్నాడని రోహిత్ అన్నాడు.
టీమిండియా కొన్నేళ్లుగా పవర్ ప్లేలో వికెట్లు తీయలేకపోతుందని.. కానీ సిరాజ్ ఈ అభిప్రాయాన్ని పోగొట్టాడని రోహిత్ శర్మ వివరించాడు. అటు ఇది తమకు గొప్ప సిరీస్ అని.. ఎన్నో సానుకూలంశాలు ఉన్నాయని రోహిత్ చెప్పాడు. తాము అద్భుతంగా బౌలింగ్ చేశామని.. అవసరమైనప్పుడల్లా వికెట్లు తీశామని పేర్కొన్నాడు. మరోవైపు ఈ సిరీస్ అసాంతం బ్యాటర్లు పరుగుల మోత మోగించడం కనువిందు చేసిందని సంతోషం వ్యక్తం చేశాడు.
సిరాజ్కు ఐదో వికెట్ దక్కాల్సింది
తిరువనంతపురం వేదికగా టీమిండియాతో జరిగిన మూడో వన్డేలో శ్రీలంక కేవలం 22 ఓవర్లు మాత్రమే ఆడగలిగింది. అయితే ఈ 22 ఓవర్లలో సిరాజ్ పూర్తి కోటా బౌలింగ్ చేశాడు. 10 ఓవర్లు బౌలింగ్ చేసి అతడు నాలుగు వికెట్లు సాధించాడు. అయితే ఈ మ్యాచ్లో సిరాజ్ ఐదో వికెట్ కోసం తాము చాలా కష్టపడ్దామని.. కానీ అది దక్కలేదని రోహిత్ అన్నాడు. సిరాజ్ తన బలం పెంచుకోవడంతో భారత క్రికెట్కు మంచిరోజులు వచ్చాయని తెలిపాడు.