YS Jagan: ముద్రగడ పద్మనాభం చాలా త్వరగానే వైసీపీ రక్తాన్ని ఎక్కించుకున్నారు. వైసీపీ నేతలకు ఏ మాత్రం తీసిపోని విధంగా మాట్లాడుతున్నారు. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు.. ఏకంగా 30 ఏళ్ల జగన్ సీఎంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఆయన కోరుకోవడంలో తప్పులేదు. కానీ, ఏపీ సీఎంగా జగన్ తప్ప మరెవరు కనుచూపు మేరలో కనిపించడం లేదని చెబుతున్నారు. దానికి కారణం కూడా చెప్పాడు. జగన్ పేదల కడుపునింపుతున్నారని.. అందుకే ఏపీలో ఆయన్ని మించిన నాయకుడు లేరని అన్నారు.
అయితే ముద్రగడ పద్మనాభం మాటలు ఎంత విచిత్రంగా ఉన్నాయంటే.. ఏపీ ప్రజలు వెర్రోళ్లు అనుకుంటున్నారో ఏమో తెలియదు. సరిగ్గా రెండు నెలల క్రితం వైసీపీలో చేరేదే లేదని ఆయన ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. టీడీపీ లేదా జనసేనలో చేరుతానని ఆయన చెప్పారు. వైసీపీ అధిష్టానం తన దగ్గరకు దూతలను పంపడం మానుకోవాలని సూచించారు. రెండు నెలల క్రితం వైసీపీలో చేరడానికి ఆసక్తి చూపని ఆయనకు ఇప్పటికిప్పుడు జగన్లో దేవుడు ఎలా కనిపించాడో అర్థం కావడం లేదు. జనానికి ఆ విషయం అర్థం కాకపోయినా.. కనీసం ముద్రగడకు అర్థం అయినా సంతోషమే.
రెండు నెలల క్రితం జనసేనలోకి చేరాలని ఎందుకు ఆరాటపడ్డారో దానికి ముద్రగడ సమాధానం చెప్పాలి. పవన్ టీడీపీ కోసమే పని చేస్తున్నారని ముద్రగడ ఆరోపిస్తున్నారు. మొదటి నుంచి పవన్ ఆ విషయంలో క్లియర్ గానే ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా జాగ్రత్త పడి జగన్ ను అధికారం నుంచి దించాలనే పవన్ రెండేళ్లగా పిలుపునిస్తున్నారు. టీడీపీ కోసం పని చేస్తున్నారా? జనసేన కోసం పని చేస్తున్నారా? అనేది ఎవరి విశ్లేషణ వారిది. కానీ, జగన్ ను అధికారం నుంచి దించాలనే మొదటి నుంచి చెబుతున్నారు. పవన్ తన బలాన్ని అంచనా వేసుకొని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. జనసేన బలానికి తగ్గట్టు సీట్లు తీసుకున్నారు. పవన్ తక్కువ సీట్లు తీసుకోవడం నచ్చక ముద్రగడ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబుకోసం పని చేస్తున్నారని ఆరోపిస్తున్న ముద్రగడ.. ఆయన ఎవరి కోసం పని చేస్తున్నారో సమాధానం చెప్పాలి. కాపు నాయుకుడిగా ఎదిగిన ఆయన వైసీపీలో చేరిన వెంటనే జగన్ కోసం పని చేస్తా అన్నారు. అంతేకాదు.. తన రాజకీయ ఎదుగుదలలో కాపుల కంటే దళితులు, వెనకబడినవారే తనకు మద్దతిచ్చారని ఆయన చెప్పారు. ఓ రకంగా చెప్పాలంటే కాపు ముసుగు తీసి వైసీపీ రంగు పలుముకున్నారు. కాపులు తన ఎదుగుదలతో 5 శాతమే కారణమన్న ముద్రగడకు ఇప్పుడు కాపుల విషయంలో పవన్ ను విమర్శించే హక్కులేదు.
జగన్ ను మించిననాయుకుడు లేడని అంటున్న ముద్రగడ ఈ ఐదేళ్ల పాలన చూసే మాట్లాడుతున్నారా? అన్న అనుమానం కలుగుతోంది. చివరికి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన జగన్ గొప్ప నాయకుడు అని ఎలా అంటారు. ఉన్న కంపెనీలను తరిమేసి, కొత్త కంపెనీలు రానీయకుండా చేసి అభివృద్ధిని శూన్యం చేసిన జగన్ ను ఎలా గొప్ప నాయకుడు అంటారు? ప్రతీ ఏడాది రాష్ట్ర అప్పులతోపాటు నిరుద్యోగాన్ని కూడా అమాంతం పెంచేసిన జగన్ ను ఎలా గొప్పోడు అంటారో ముద్రగడ సమాధానం చెప్పాలి.