Muthyala Venkateshwara Rao: అనకాపల్లిలో రాజకీయ పరిణామాలు అనుకున్నట్లుగానే జరుగుతున్నాయి. అనకాపల్లి నియోజకవర్గం నుంచి ప్రముఖ వ్యాపారవేత్త, ఎం వి ఆర్ గ్రూప్ సంస్థల అధినేత ఎం వి ఆర్ రాజకీయ రంగ ప్రవేశం ఇంచుమించు ఖరారు అయినట్లే. చాలా సంవత్సరాలుగా అనకాపల్లి నియోజకవర్గ ప్రజలకి తను చేసే సమాజ సేవ ద్వారా అత్యంత ఆప్తుడిగా మారిపోయాడు ఎం వి ఆర్. ఎన్నో సంవత్సరాలుగా అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఎం.వి.ఆర్ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. వృద్ధులను తీర్థయాత్రలకు పంపించడం, రూపాయికే భోజనం పెట్టడం..
యువతకు ఉపాధి, విద్య, వైద్యం లాంటివి కల్పించడం చేస్తూ వస్తున్నారు. ఇంకా ఉచిత, ఆరోగ్య శిబిరాలు దేవాలయాల పునరుద్ధరణ అలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఏడాదిలో ఆరు నెలల పాటు ఆధ్యాత్మిక చింతన గడిపే ఎం వి ఆర్ రాజకీయాల్లోకి రావడం కూడా ప్రజల కోసమే అనేది అక్కడి ప్రజల నమ్మకం. ఎంవిఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తాడని అందరూ ముందుగానే భావించారు. అతనిని తమ పార్టీలో చేర్చుకునేందుకు అన్ని పార్టీలు తపన పడుతున్నాయి.
అయితే ఎంవిఆర్ మాత్రం టికెట్ హామీ ఇస్తేనే జాయిన్ అవుతానని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఎం వి ఆర్ పై అనకాపల్లి నియోజకవర్గంలో సర్వే కూడా చేయించినట్లు సమాచారం. ఇక జనసేన నుంచి నాగబాబు ఈ నియోజకవర్గ నుంచే పోటీ చేయటానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం. అయితే ఒక ప్రధాన పార్టీ నుంచి ఎంవిఆర్ కి టికెట్ కన్ఫర్మేషన్ వచ్చినా ఆ పార్టీలో ఆయన జాయిన్ అవ్వటానికి ఆసక్తి చూపించడం లేదు.
ఆ పార్టీకి ప్రజల్లో తీవ్రవ్యతిరేకత ఉందని రాజకీయాలలో అడుగుపెడుతూనే ప్రజావ్యతిరేకతను తట్టుకోవడం కష్టమని ఎం వి ఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఏ పార్టీలోనూ చేరకుండా సొంతంగా ప్రజాభిమానాన్ని కూడగట్టుకున్న ఎంవీఆర్ ఎన్నికల్లో కూడా స్వతంత్రంగా పోటీ చేస్తే బెటర్ అని ఆయన రాజకీయ సహచరులు సలహా ఇస్తున్నట్లు తెలుస్తోంది. అలా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఎంవిఆర్ కచ్చితంగా గెలుస్తారు అంటున్నారు స్థానిక రాజకీయ వర్గాల వారు.