Success Story: ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా కోర్సా లక్ష్మీ పేరు మారు మోగిపోతుంది. ఇంతకీ ఈ లక్ష్మీ ఎవరు అంటే జేఈఈ లో ర్యాంకు సాధించిన ఒక గిరిజన యువతి.. ఇంతకీ ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ఆమె సాధించిన ఘనత ఏమిటి అన్న వివరాల్లోకి వెళితే..
భద్రాద్రి జిల్లాలోని కాటాయిగూడెం అనే మారుమూల గిరిజన గ్రామానికి చెందిన శాంతమ్మ కన్నయ్య అనే దంపతులకు ముగ్గురు పిల్లలు సంతానం కాగా ఇద్దరు అన్నల తర్వాత పుట్టింది లక్ష్మి. అమ్మా నాన్నలు చదువుకోలేదు. తండ్రి సైకిల్ పై ఐస్క్రీమ్ అమ్మి, అమ్మ కూలీ చేసి తెచ్చిన దాంతోనే ఇల్లు గడిచేది.
చదువు చెప్పించే స్థోమత కూడా లేదు. దాంతో తన తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించిన లక్ష్మీ ప్రతిభతోనే మార్గం సుగమం చేసుకుంది లక్ష్మి. అక్షరం ముక్క నేర్చుకుంటే వీళ్ల బతుకులైనా బాగుంటాయని స్కూలుకి పంపేదట వాళ్లమ్మ. పెద్దన్నయ్య మాట వినేవాడు కాదు. అమ్మ మందలించడంతో ఇంట్లోంచి వెళ్లిపోయాడు. ఇప్పటికీ ఆచూకీ తెలీదు. వరంగల్లో చదువుకుంటానని వెళ్లిన చిన్న అన్నయ్య మానేసి, పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడ్డాడు. దీంతో అమ్మానాన్నలు వాళ్ల ఆశలన్నీ నామీదే పెట్టుకొని బతుకుతున్నారు. దానికితోడు నాకు చదువంటే ఇష్టం. పెద్దయ్యాక వాళ్లకు ఆర్థికంగా అండగా నిలవాలని కష్టపడి చదివేదాన్ని అని తెలిపింది 17 ఏళ్ల లక్ష్మి. ఇక నాలుగో తరగతి వరకు లక్ష్మి కాటాయిగూడెం ప్రాథమిక పాఠశాలలోనే చదివింది.
ఆ తర్వాత ప్రవేశపరీక్ష రాసి భద్రాచలం బాలికల గురుకుల పాఠశాలలో ప్రవేశం పొందింది. అయితే అప్పటివరకూ తెలుగు మీడియంలో చదివిన తను అయిదో తరగతిలో ఇంగ్లీష్ మీడియం లోకి మారాల్సి వచ్చింది. మొదట్లో ఇబ్బంది పడినా కూడా ఇంగ్లీష్ మీడియం కి తొందరగా అలవాటు పడింది. మంచి విద్యార్థిని అనిపించుకుంది. పదిలో 10 జీపీఏ సాధించింది. ఇంటర్ కూడా గురుకులాల్లోనే చదివింది. లక్ష్మి ప్రతిభను చూసి ట్రైబల్ గురుకుల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శిక్షకులు జేఈఈలో శిక్షణ ఇచ్చారు. చదువు, జేఈఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ సాగించింది. ఇక ఇంటర్లో 992 మార్కులతో పాటు జేఈఈలో 1,371 ర్యాంకు సాధించి, పట్నా ఐఐటీలో సీటు పొందింది. జేఈఈలో ర్యాంకును చూసి లక్ష్మిని ఉపాధ్యాయులు, స్నేహితులు ప్రశంసలతో ముంచెత్తారు. ఐఐటీలో సీటు సాధించాక ఆమె ఆనందానికి అవధుల్లేవు.
ఇక తన భవిష్యత్తుకు ఢోకా లేదనుకున్న ఆమెకు ఊహించని విమర్శలు ఎదురయ్యాయి. ఆడపిల్లకు చదువు అవసరమా? దానికోసం అంత దూరం పంపిస్తావా. అబ్బాయిల చదువది. అమ్మాయికెందుకు అంటూ ఇరుగూపొరుగూ నానా మాటలు అన్నారు. ఎప్పుడు చదువుకుంటా అన్నా ప్రోత్సహించే అమ్మానాన్న వాళ్ల మాటలు విని అంత దూరం పంపమన్నారు. దీంతో చదువుకి ఎక్కడ దూరమవుతానో అని భయమేసింది. కొన్ని రోజులపాటు అన్నమే ముట్టలేదు. అమ్మానాన్న బతిమాలినా మంకుపట్టు విడవలేదు. ఈ విషయం తెలిసిన ప్రిన్సిపల్ ఇంటికొచ్చి వాళ్లకి సర్దిచెప్పారు. మా మేనమామ, అత్తయ్య కూడా ఆమెకు తోడుగా నిలిచారు. దీంతో తల్లిదండ్రులు లక్ష్మీ దెబ్బకు దిగి వచ్చారు. ఈఈఈ తీసుకొని ఐఐటీలో చేరింది లక్ష్మి. ఇప్పుడు తనకు ఎంతో గర్వంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అయితే తన లక్ష్యం సివిల్స్ అని అది సాధించి తన గిరి ప్రజలకీ, సమాజానికీ సేవ చేయాలనుంది అని చెప్పుకొచ్చింది లక్ష్మి. అంతేకాకుండా లక్ష్యంపై గురి ఉంటే ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థ ఏదైనా అడ్డంకి కాదని తోటివారికి సలహానీ ఇస్తోంది. లక్ష్మి పట్టుదల గురించి విన్న హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తనకు ఫోన్ చేశారు. నువ్వు ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తి. బాగా చదివి, దేశానికి మంచి పేరు తేవాలి అని అభినందించడమే కాదు రాజభవన్కు ఆహ్వానించడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.