Nandamuri Balakrishna: స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా మంగళవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో పర్యటించారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. బాలయ్య రోడ్ షోలకు జనం ఎగబడ్డారు. ఎమ్మిగనూరు, కోసిగి లో జరిగిన రోడ్ షోలో బాలకృష్ణ మాట్లాడుతూ సీఎం జగన్ సాధిస్తున్న అకృత్యాలపై విమర్శలు గుప్పించారు.
జగన్ ఒక్క ఛాన్స్ అని వేడుకుంటే ప్రజలు నమ్మి ఓట్లు వేసి గెలిపించారు. అయితే అందరి నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ ఆయన అందర్నీ నిలువునా ముంచారు. రాయలసీమలో సాగునీరు ఇచ్చింది ఎన్టీఆర్, చంద్రబాబు లేనని గుర్తు చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విధ్వంసక పాలన సాగుతోంది, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో నవ్యాంధ్ర ప్రపంచపటంలోకి ఎక్కితే నేడు ఆ పేరు కూడా ఎక్కడా కనిపించడం లేదు.
ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు జగన్, ఇక నీ ఆటలు సాగవు అంటూ తనదైన స్టైల్ లో మాస్ వార్నింగ్ ఇచ్చారు బాలకృష్ణ. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అభివృద్ధి కావాలో అరాచకం కావాలో ప్రజలు తెల్చుకోవలసిన సమయం ఆసన్నమైంది. 12 లక్షల కోట్లు అప్పు చేసిన జగన్ నవరత్నాలకు చేసిన ఖర్చు 2.50 లక్షల కోట్లేనని మిగతా సొమ్మంతా ఏం చేశారని ప్రశ్నించారు.
ప్రచార హోల్డింగ్ ల కోసం 1600 కోట్లు ఖర్చుపెట్టిన జగన్ ఎవరి సొమ్ము ఖర్చు పెట్టారని నిలదసారు. రాష్ట్ర విభజన తరువాత ఆరువేల కోట్ల అప్పుతో ఏర్పడిన రాష్ట్రాన్ని చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్లారని, అందుకే ఈ ఎన్నికలలో కూడా సైకిల్ గుర్తుకే ఓటు వేసి తెదేపా అభ్యర్థులను గెలిపించాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనారిటీల సంక్షేమం కోసం ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాలు చేపట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధిని గురించి కూడా ప్రజలకు వివరించారు బాలకృష్ణ.