Nara Bhuvaneswari: ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో అన్ని పార్టీల అధినేతలు వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కూడా నిజం గెలవాలి అనే పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ద్వారా ఈమె చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శిస్తూ ఉన్నారు.
తాజాగా నారా భువనేశ్వరి నూజివీడు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె వైసిపి నేతలపై అలాగే వైసిపి ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం విశాఖను ఎందుకు రాజధానిగా కావాలనుకుంటుందో తెలుసా అంటూ ఈమె అసలు విషయం వెల్లడించారు. ఇటీవల బ్రెజిల్ నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ విశాఖకు చేరుకున్న సంగతి తెలిసిందే.
విశాఖలో తీర ప్రాంతం ఉండడం.. బలమైన పోర్టు ఉండడంతో ఇక్కడ నుంచి ఇలాంటి గంజాయి.. డ్రగ్స్ను రవాణా చేసుకునేందుకు సులభంగా ఉంటుంది. అందుకే వైసీపీ ఇక్కడ రాజధాని కావాలని అంటోంది.తప్పుడు పనులు చేయడానికి వైసీపీ ప్రభుత్వానికి తెలివి ఎక్కువగా ఉందని, గంజాయి వ్యాపారంతో వాళ్ల పొట్టలు, జేబులు నింపుకొంటారని నారా భువనేశ్వరి విమర్శలు కురిపించారు. అంతేకాకుండా ఏపీలో ఇప్పటివరకు సుమారు 31,000 మంది అమ్మాయిలు కనిపించకుండా పోతే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉందని తెలిపారు.
ఇక ఎంతో మంది గంజాయికి బానిసలుగా మారి అమ్మాయిల పట్ల అత్యాచారాలకు పాల్పడుతూ వారిని మానసికంగా హింసిస్తూ ఆత్మహత్య చేసుకునేలా చేస్తున్నారంటూ ఈమె అధికార ప్రభుత్వ వ్యవహార శైలి పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.