YS Sharmila: తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో వైయస్ షర్మిల పోటీ చేస్తారా లేదా అన్న విషయంపై ఇప్పటికే అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవడంతో పాటు అనేక రకాల కథనాలు కూడా వినిపించిన విషయం తెలిసిందే. అలాగే కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుదాం అనుకున్న షర్మిలకు ఆ పార్టీ ఊహించని షాక్ ఇచ్చింది. దాంతో షర్మిల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అయినప్పటికీ షర్మిలా మాత్రం నమ్మకంతో తప్పకుండా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాను అంటూ ప్రగల్పాలు పలికింది. కానీ ఆచరణలోకి వచ్చేసరికి వైసీపీలో అటువంటి వాతావరణమే కనిపించడం లేదు.
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ వైఎస్సార్టీపీ అనే సొంత పార్టీని వైఎస్ షర్మిల పెట్టారు. నిరుద్యోగుల కోసం దీక్షలు చేశారు. ఎన్నో ఒడిదుడుకులను కూడా ఎదుర్కొన్నారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ అధికార పార్టీ నేతలపై ఇష్టానుసారం విమర్శలను కూడా గుప్పించారు. ఒక దశలో ఎంతో కొంత తెలంగాణలో షర్మిల ప్రభావం చూపుతుందని అందరు భావించారు కేసీఆర్ సర్కార్కు వ్యతిరేకంగా ఆమె దూకుడు ప్రదర్శించడం ప్రధాన పార్టీలను భయపెట్టింది. షర్మిల ఏ పార్టీ కొంప ముంచుతారో అనే చర్చ కూడా జరిగింది. అయితే కర్నాటక మంత్రి డీకే శివకుమార్ ద్వారా కాంగ్రెస్లో పార్టీని విలీనం చేయడానికి షర్మిల రాయబారం నడిపారు.
ఇక వీలీనమే తరువాయి అని అంతా అనుకుంటున్న సమయంలో బ్రేక్ పడింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అడ్డుకోవడం వల్లే షర్మిల పార్టీ విలీనం కాకుండా ఆగిపోయిందని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తనను కాంగ్రెస్ అవమానించిందని షర్మిల రగిలిపోయారు. తన పార్టీ నాయకులతో ఆమె సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి బీఆర్ఎస్కు రాజకీయంగా ప్రయోజనం కలగకూడదని అనుకున్నానని, అయితే కాంగ్రెస్ నుంచి తగిన చొరవ కొరవడిందని ఆమె వాపోయారు.
కావున బీఆర్ఎస్ లాభపడితే తమ తప్పు లేదని కాంగ్రెస్పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. దీంతో షర్మిల ఎన్నికల బరిలో వుంటారని అనుకున్నారు. నామినేషన్ల ప్రక్రియకు గడువు ముంచుకొస్తున్నా షర్మిల తన అభ్యర్థులను ప్రకటించలేదు. మొదటి నుంచి ఖమ్మం జిల్లా పాలేరులో తాను పోటీ చేస్తానని షర్మిల చెబుతూ వచ్చారు. కనీసం తానైనా అక్కడి నుంచి పోటీ చేస్తారా? లేదా? అనేది తేలడం లేదు.