Onion Price Hike:మొన్నటి వరకు టమాటా ధరలు ఆకాశానంటుతుండడంతో పాటు వినియోగదారులను భయపెట్టగా ఇప్పుడు ఆ స్థానంలోకి ఉల్లిపాయ చేరుకుంది. గత వారం రోజులుగా ఉల్లి ధర క్రమంగా పెరుగుతూనే ఉంది. దీంతో వినియోగదారులు కలవర పడుతున్నారు. గతంలో కరోనా మహమ్మారి సమయంలో ఉల్లిపాయ ధరలు కిలో దాదాపు 200 వరకు పలికిన విషయం తెలిసిందే.. ఇప్పుడు ఉల్లిపాయ విషయంలో మరోసారి అలాంటి పరిస్థితి ఎదురవుతుందా అని జనాలు భయపడుతున్నారు.
అయితే రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.30 వరకు ఉండగా మాల్స్, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని చిల్లర దుకాణాల్లో రూ.35 నుంచి రూ.40 వరకు విక్రయిస్తున్నారు. మార్చి నాటితో పోలిస్తే సగటున కిలోకి 150 శాతం పైగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉల్లి సాగు తగ్గిపోవడంతో ఉత్పత్తి క్షీణించింది. కర్ణాటక లోనూ కొత్త పంట రావడం లేదు. ఈ ప్రభావంతో ధరలు పెరుగుతున్నాయి. ఉల్లి ధరల నియంత్రణలో భాగంగా కేంద్రం ఈ ఏడాది డిసెంబరు ఆఖరు వరకు ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకం విధించింది. నాఫెడ్ ద్వారా ఉల్లిని సేకరించి మార్కెట్లోకి విడుదల చేయడంతో కొంతమేర ఉపశమనం లభిస్తున్నప్పటికీ ధరల పెరుగుదల ఆగలేదు. వరుసగా మూడేళ్ల నుంచి పంట దెబ్బతినడంతో ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో సాగు భారీగా తగ్గింది.
దీంతో మార్కెట్కు పంట రావడం లేదు. తాడేపల్లిగూడెం మార్కెట్కు ఈ సమయంలో రోజుకు 80 నుంచి 90 లారీలు వచ్చేవి. ఇప్పుడు ఒకటి రెండు లారీల ఉల్లి మాత్రమే వస్తుందని వ్యాపారులు వివరించారు. 15 రోజుల నుంచి నాఫెడ్ ద్వారా రోజుకు 15 లారీల వరకు ఉల్లి సరఫరా అవుతోంది. కర్నూలు ఉల్లి మార్కెట్ పరిస్థితీ ఇంతే. సరుకు తగ్గిపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావాల్సి వస్తోంది. మార్చిలో కిలో ఉల్లి రూ.15 ఉండగా సెప్టెంబరు నాటికి రెట్టింపు అయింది. ఆదివారం విజయవాడ రైతు బజార్లో కిలో రూ.30 చొప్పున ఉంది. చిత్తూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని ప్రాంతాల్లో కిలో రూ.40 పైగా విక్రయిస్తున్నారు.