Pawan Kalyan: ఏపీలో పొలిటికల్ హీట్ మొదలైంది. 2024 ఎన్నికలకు అన్ని పార్టీల్లో ఇప్పటి నుంచే ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. జనసేన కూడా ఈసారి తన పంజా విసరనుంది. అయితే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని ఇప్పటికీ అందరూ చర్చించుకుంటూనే ఉన్నారు. తాజాగా దీనికొక సమాధానం దొరికింది. ఇప్పుడు అన్ని పార్టీలు కూడా పవన్ ఎక్కడ నుంచి పోటీచేస్తారని దానిపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
గత ఎన్నికల్లో రెండు చోట్ల పవన్ పోటీ చేస్తే రెండూ చోట్ల కూడా నిరాశే ఎదురైంది. భీమవరంతో పాటు గాజువాక నుంచి పోటీచేసిన పవన్ కు ఆశించిన ఫలితాలు రాలేదు. మరోసారి అక్కడి నుంచే బరిలో దిగితే గెలిపించుకుంటామని అక్కడి ప్రజలు చెబుతున్నా పవన్ మాత్రం ఈసారి తిరుపతి, విశాఖ, కాకినాడ జిల్లాల నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై జనసేన అధిష్టానం కసరత్తు కూడా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పలు వార్తలు షికారు చేశాయి. అయితే ఎట్టకేలకు పవన్ పోటీ చేసే నియోజకవర్గంపై ఓ క్లారిటీ వచ్చేసింది.
కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పవన్ పోటీ చేయనున్నట్లు సమాచారం. ఇక్కడి నుంచే పోటీ చేయాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. గ్రామస్థాయి నాయకులు, ప్రజలు పవన్ ను ఆత్మీయంగా స్వాగతం పలుకుతూ ఇక్కడి నుంచే పోటీ చేయాలని కోరుతున్నారు. చంద్రబాబుకు కుప్పం, జగన్ కు పులివెందుల మాదిరిగా పిఠాపురాన్ని పవన్ కు కంచుకోటగా మారుస్తామని అంటున్నారు.
పీఠాపురంలో కాపు సామాజికవర్గం అధికంగా ఉంది. అదే విధంగా బీసీలు, ఎస్సీలు కూడా బాగానే ఉన్నారు. కాపులతో పాటు అన్ని సామాజికవర్గాల ప్రజలు పవన్ ఇక్కడి నుంచే పోటీ చేయాలని కోరుకుంటున్నారు. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థి దాదాపు 30 వేల వరకూ ఓట్లు ఇక్కడి నుంచే తెచ్చుకోవడం విశేషం. పవన్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే వార్ వన్ సైడ్ గా నిలుస్తుందని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. ఒక వేళ టీడీపీ, జనసేన కలిస్తే మాత్రం వైసీపీ దరిదాపుల్లో కూడా ఉండదని, అందుకే పవన్ ఇక్కడ పోటీ చేస్తేనే గెలుపు ఖాయమని పలువురు అంటున్నారు. అందుకే పవన్ ఇక్కడి నుంచే పోటీ చేస్తారని సమాాచారం.