Pawan Kalyan: జగన్, చంద్రబాబుతో సమానంగా పాపులారిటీ ఉన్న వ్యక్తి జనసేన అధినేత పవన్. అయితే, ఆయన పాపులారిటీ ప్రచారానికే తప్ప. ఓట్లు రాల్చడానికి పనికి రాలేదు. గత ఎన్నికల్లో జనసేన 130 స్థానాల్లో పోటీ చేసింది. పవన్ గాజువాక, భీమవరం నుంచి పోటీ చేశారు. అయితే, ఫలితం మాత్రం ఏపీ కనిపించలేదు. ఆయన పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. అయితే, గతంలో జరిగిన తప్పులను ఇప్పుడు సరిదిద్దుకుంటూ సరికొత్త పవన్ గా అడుగులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో 130 స్థానాల్లో జనసేన పోటీ చేయడం వలన రాష్ట్రవ్యాప్తంగా ఆయన పర్యటించాల్సి వచ్చింది. ప్రతీ దగ్గరకు ఆయన వెళ్తే కానీ.. జనసేన మొహం చూసే పరిస్థితి ఉండేది కాదు. ఎందుకంటే.. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారెవరూ పెద్దగా పాపులారిటీ ఉన్నవ్యక్తులు కాదు. దాని వలన ఆయన స్వయంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాల్సి పరిస్తితి ఏర్పడింది. దీంతో.. ఆయన పోటీ చేసిన రెండు నియోజక వర్గాలపై కూడా పూర్తిగా ఫోకస్ చేయలేకపోయారు. భీమవరం, గాజువాకలో త్రిముఖపోరులో ఓట్లు చీలి పవన్ ఓడిపోయారు.
అయితే, ఇప్పుడు ఆ తప్పు చేయలేదు. పొత్తులో భాగంగా జనసేన 21 ఎమ్మెల్యే స్థానాల్లో , రెండు లోక్సభ స్థానంలో పోటీ చేస్తుంది. అంటే.. గతంలో వలే రాష్ట్రం మొత్తం పర్యటించాల్సిన పని లేదు. కేవలం ఈ 23 స్థానాలపై ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఆ 23 స్థానాల్లో కూడా జనసేన గతంలో కంటే ఇప్పుడు బలంగా ఉంది. పవన్ తో రావాల్సిన అవసరం లేదు.. తన స్థానాలను తామే గెలిపించుకుంటామనే అంతగా కార్యకర్తలు ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారికి తోడు.. కూటమి పార్టీ నేతలు కూడా స్థానికంగా సహకరిస్తారు. దీంతో.. పవన్ తను పోటీ చేస్తున్న పిఠాపురంపై ఫుల్ గా ఫోకస్ చేసే సమయం దొరికింది.
పవన్ మరో తెలివైన పని చేశారు. గతంలా రెండు స్థానాల్లో కాకుండా ఒక స్థానంలోనే పోటీ చేస్తున్నారు. దీంతో.. ఇప్పుడు ఒకే దగ్గర పవన్ తన దృష్టికి కేంద్రీకరించవచ్చు. ఇక్కడ ఇంకో లాభం కూడా ఉంది. రెండు స్థానాల్లో పోటీ చేయడం ఒక నెగెటివ్ సంకేతాన్ని పంపినట్టు అవుతుంది. ఒక దగ్గర కాకపోతే మరో దగ్గర గెలుస్తామని.. అంటే.. ఒకే స్థానంలో పోటీ చేసి.. గెలుస్తా అని చెప్పుకునే ధైర్యం లేదనే సిగ్నల్ ప్రజల్లోకి వెళ్తుంది. కానీ.. ఒకేదగ్గర పోటీ చేయడం వలన పవన్ గెలుపుపై ఆయనకు నమ్మకం ఉందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రజలకు పాజిటివ్ సంకేతాలు పంపడమే కాకుండా.. క్యాడర్ లో కూడా ఆత్మ విశ్వాసాన్ని పెంచినట్టు అవుతుంది.
ఇక పిఠాపురంలో పవన్ కు సానుకూల వాతావరణం ఉంది. పవన్ ఫుల్ ఫోకస్ పిఠాపురంపై పెట్టారు. పెద్ద ఎత్తున జనసైనికులు అక్కడ మోహరించారు. దీనికి తోడు టీడీపీ కూడా అక్కడ బలంగా ఉంది. టీడీపీ నేత వర్మ పవన్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పవన్ 2014 నుంచి ఇలా వ్యూహాత్మకంగా వెళ్తే.. పార్టీ మరింత బలపడి ఉండేది. ఇప్పుడు పవన్ జనసేనకే కాదు.. కూటమి మొత్తానికి బలంగా మారారు. ఎందుకుంటే.. కూటమి ఏర్పడింది అంటే దానికి ప్రధాన కారణం పవన్. ఎవరు రెచ్చగొట్టినా.. రెచ్చిపోలేదు. ఎవరు కించపరినా ఆవేశ పడలేదు. కేవలం ఆయన టార్గెట్ కూటమిని ఏర్పాటు చేయడంపైనే ఉంది. చివరికి దాన్ని సాధించుకున్నారు.