Pawan Kalyan: పవన్ ప్రచారం కోసం జనసేన కార్యకర్తలు రెండు నెలలుగా ఎదురు చూశారు. అయితే, ఎట్టకేలకు ప్రారంభించిన వారాహి యాత్ర ఒక్కరోజుతోనే ఆగిపోయింది. పవన్ కు ఎండదెబ్బ తగిలి అస్వస్థతకు గురైయ్యారు. దీంతో.. వైద్యులు పవన్ ను రెస్ట్ తీసుకోవాలని సూచించారు. నిజానికి పవన్ వారాహి విజయభేరి యాత్ర ప్రారంభించడానికి ముందే జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. కానీ, యాత్ర షెడ్యూల్ ను ముందుగా ప్రకటించడంతో ఆపడం ఇష్టం లేక షెడ్యూల్ ప్రకారం యాత్రను ప్రారంభించారు. అయితే.. ఆయనకు ఆరోగ్య సహకరించకపోవడం, ఎండదెబ్బ తగలడంతో 4 రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అందుకే.. ఆదివారం శక్తిపీఠాన్ని దర్శించుకొని తర్వాత కూటమి నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించి హైదరాబాద్ వెళ్లిపోయారు. మరో రెండు రోజుల తర్వాత ఆయన తన వారాహి యాత్రను ప్రారంభిస్తారు. ఆయన తన యాత్రను నాలుగు రోజుల పాటు రద్దు చేసుకున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రచారంలో బాగా వెనబడ్డారు. ప్రచారంలోనే కాదు.. అభ్యర్థుల ఎంపికలోనూ వెనకబడ్డారు. 21 మంది అభ్యర్థులను ప్రకటించడానికి చాలా సమయం తీసుకున్నారు. ఇంకా రెండు స్థానాలు పెండింగ్లో ఉన్నారు. అవనిగడ్డ, పాలకుండ స్థానాలు పొత్తులో భాగంగా జనసేన ఖాతలోకి వచ్చాయి. ఇవాళ, రేపు ఆ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. కానీ.. మిగిలిన పార్టీలతో పోల్చుకుంటే.. పవన్ ప్రచారంలో బాగా వెనకబడ్డారు. జగన్ సిద్దం సభలను పూర్తి చేసుకొని మేమంతా సిద్దం అంటూ బస్సు యాత్రను నిర్వహిస్తున్నారు. చంద్రబాబు బెయిల్ తర్వాత వెంటనే లోకేష్ తన యువగళం యాత్రను పూర్తి చేసి శంఖారావం పేరు రెండో దశ ప్రచారం చేస్తున్నారు. ఇక చంద్రబాబు కూడా రా కదలిరా అంటూ తొలి దశ ప్రచారం పూర్తి చేశారు. ఇప్పుడు ప్రజాగళం యాత్ర చేస్తున్నారు. కానీ.. ఎన్నికల ముందు అసలు ఎలాంటి పర్యటన చేయలేదు. కూటమి కట్టడంలోనే ఆయన పూర్తిగా నిమగ్నమయ్యారు. ఇప్పుడు కూటమి ఏర్పాటు టికెట్ల కేటాయింపు కూడా పూర్తి అయింది. దీంతో ఎట్టకేలకు యాత్రను ప్రారంభించారు. షెడ్యూల్ ప్రకారం తొలి దశలో జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లోని 10 స్థానాలను కవర్ చేయనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రారంభించాలి. షెడ్యూల్ ప్రకారం అక్కడ ప్రారంభించారు కానీ.. నియోజకవర్గం మొత్తం పర్యటించలేదు.
ఆ తర్వాత ఏప్రిల్ 3న తెనాలిలో పవన్ పర్యటిస్తారు. అక్కడ నుంచి నేరుగా ఉత్తరాంధ్ర వెళ్తారు. 4న నెల్లిమర్లలో జనసేన అభ్యర్థి తరుఫున ప్రచారం చేస్తారు. అక్కడ నుంచి 5న అనకాపల్లికి చేరుకొని తన పార్టీ అభ్యర్థిని గెలిపించాలని స్థానిక ప్రజలను కోరనున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 6న యలమంచిలిలో యాత్ర కొనసాగనుంది. ఏప్రిల్ 7కి పెందుర్తిలో ప్రచారం చేస్తారు. ఏప్రిల్ 8న కాకినాడ రూరల్ లో పర్యటిస్తారు. 9న మరోసారి పిఠాపురం వారాహి యాత్ర జరుగనుంది. ఆ తర్వాత 10న రాజోల్ లో జనసేన అభ్యర్థి తరుఫున ప్రచారం చేస్తారు. 11కి పి.గన్నవరం చేరుకుంటారు. 12న రాజానగరంలో పర్యటించి తొలి దశ యాత్రను యాత్రను ముగిస్తారు. ప్రతీ నియోజవర్గంలో రెండు ప్రాంతాల్లో సమావేశాలతో పాటు.. ఒక బహిరంగ సభలో పాల్గొంటారు. షెడ్యూల్ ప్రకారం ఇలా జరగాల్సి ఉంది. కానీ, పవన్ కి ఆరోగ్యం సహకరించకపోవడంతో షెడ్యూల్ ఏమైనా మారుతుందా? చూడాలి.