PawanKalyan: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్పై తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు వరిసాగు నేర్పిందని ఎన్టీఆరే అని పవన్ అనడంపై పరోక్షంగా మండిపడ్డారు. అలాంటి వ్యాఖ్యలను ఎవరో మూర్ఖుడు, ప్రముఖ సినీ నటుడు అనడం సిగ్గచేటన్నారు. అంతటి మూర్ఖుడిని ఎక్కడ చూడలేదని ధ్వజమెత్తారు. చరిత్ర తెలియని మూర్ఖులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
వరి పండించడంలో తెలంగాణ నెంబర్ ఒన్
1100, 1200 సంవత్సరాల క్రితమే కాకతీయుల కాలంలో తెలంగాణలో చెరువుల కింద వరి పండించారని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. దాని కొనసాగింపుగా ఇప్పటికీ తెలంగాణలో వరి పండిస్తున్నారు. మూర్ఖపు, పక్షపాత పరిపాలన వల్ల తెలంగాణలో పండాల్సిన భూముల్ని ఎడారిగా మార్చారని మండిపడ్డారు. రైతుల్ని వలసపోయేలా చేసిన దుర్మార్గులు వారని ధ్వజమెత్తారు. ఇప్పుడు భారతదేశంలో వరి పండించడంలో తెలంగాణ నెంబర్ ఒన్ అని తెలిపారు. తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు. యువత నూతనంగా ఆలోచించి భిన్నమైన రంగాలను ఎంచుకుంటోందని చెప్పారు.
కాగా, ఇటీవల పవన్ కల్యాణ్ ఓ సమావేశంలో తెలంగాణ వాళ్లకి ఎన్టీఆర్ పాలనలోనే వరి అన్నం సాగు తెలిసిందని వ్యాఖ్యానించారు. తమకు రెండు రూపాయలకే ఎన్టీఆర్ బియ్యం ఇచ్చాడని ఓ మహిళ చెప్పిందన్నారు. బియ్యం అంటే ఎలా వుంటుందో తెలియదన్నారని పవన్ తెలిపారు. తన జల్సా సినిమాలో అది ఉన్నట్టు చెప్పారు. పండగకో పబ్బానికో తెలంగాణలో అన్నం వండుకుంటారన్నారు. తెలంగాణలో వరి పండేది కాదన్నారు. కేవలం రాగి లాంటి పంటలు మాత్రమే పండేవన్నారు. ఈ వ్యాఖ్యలే మంత్రి నిరంజన్రెడ్డి ఆగ్రహానికి కారణం.
ఏపీ అధికార పార్టీ నేతల పవన్ను విమర్శిస్తే.. అంతెత్తున రెచ్చిపోయే జనసైనికులు తెలంగాణ మంత్రి నిరంజన్రెడ్డి వ్యాఖ్యలపై కిక్కురుమనడం లేదు. అలాగే జనసేన నేతలు కూడా ఎక్కడా కౌంటర్ కూడా ఇవ్వక పోవడం గమనార్హం.