Minister Roja: తాజాగా మహానాడులో బాబు ప్రకటించిన టీడీపీ మేనిఫెస్టోపై ఏపీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. అది మేనిఫెస్టో కాదని,మాయా ఫెస్టో అని ఆమె అభివర్ణించారు. చంద్రబాబు మూడుసార్లు మేనిఫెస్టో ఇచ్చి ప్రజలను ఏ విధంగా మోసం చేశారో అందరికీ తెలిసిందే అని ఆమె అన్నారు. చంద్రబాబు సినిమా ఫక్కీలో మేనిఫెస్టో వన్, టు, త్రీ అంటూ విడుదల చేయడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది అని తెలిపారు రోజా. 14 సంవత్సరాలు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి ప్రస్తుతం కొత్తగా పూర్ టూ రిచ్ అనడం కామెడీగా ఉందంటూ ఆమె సెటైర్స్ వేసింది.
చంద్రబాబు పరిపాలనలో రెండు ఎకరాల నుంచి 2000 కోట్లకు అధిపతి రిచెస్ట్ ఎమ్మెల్యే అయ్యాడని అన్నారు. టీడీపీ మేనిఫెస్టోలో వెల్లడించిన ఆరు అంశాల్లో మూడు అంశాలు సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలు, రెండు ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పథకాలు. ఒకటి బిజెపి పథకం వాటిని చంద్రబాబు కాపీ కొట్టారని రోజా ఆరోపించారు. తనకన్నా అనుభవం ఉన్న వారు ఎవరు లేరని చెప్పుకునే వ్యక్తి సొంతంగా ఒక పథకం కూడా పెట్టలేకపోయారు అంటూ విమర్శించారు రోజా. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేని వ్యక్తి నేడు పేద మహిళలకు ఇచ్చిన భూములను శవాలు పాతిపెట్టడానికా అని ఎగతాళి చేయడం ఎంతవరకు కరెక్ట్? అని మంత్రి రోజా నిలదీశారు.