SBI: ఒకప్పుడు దొంగతనాలు.. దోపిడీలు అంటే ఏ అర్థరాత్రో, వేకువజామున ఎవరు లేనప్పుడు జరిగేవి. అవి కూడా నెలలో ఒక్కసారో.. రెండు సార్లు మాత్రమే జరిగేవి. ప్రస్తుత కాలంలో విచ్చలవిడిగా దొంగతనాలు దోపిడీలు జరుగుతున్నాయి. కొందరు పనిచేయక, సోమరితనం తో తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే అత్యాశతో దొంగతనాలకు పాల్పడుతూ కటకటాల పాలవుతున్నారు. మరి కొందరైతే తుపాకులు, కత్తులు, కఠోరాలతో మిట్ట మధ్యాహ్నం వందల సంఖ్యలో జనం చూస్తుండగానే కోట్లు, లక్షల్లో దోచుకుపోతున్నారంటే అర్థం చేసుకోవచ్చు వారు ఎంతకు తెగించారో అని. తాజాగా రాజస్థాన్లోని బ్యాంకును లూటీ చేసిన ఘటన ఒక్కింతకు గురి చేస్తోంది.
కేవలం ఇద్దరే మిట్ట మధ్యాహ్నం బ్యాంకు లోకి వచ్చి కేవలం ఒకే ఒక నిమిషంలో అక్కడున్న వారందరినీ భయందోళనకు గురి చేసి అందినకాడికి దోచికెళ్లిన దృశ్యాలు అక్కడున్న సీసీ టీవీ ఫుటేజీల్లో రికార్డు అయ్యాయి. ఇద్దరు వ్యక్తులు హెల్మెట్లు ధరించి తుపాకులతో బ్యాంకులో వస్తారు.. ముందుగా సెక్యురిటీ సిబ్బంది సహాయంతో క్యాషియర్ కౌంటర్ దగ్గరకు వెళ్లి ఆయనకు తుపాకి గురిపెట్టి బ్యాగ్ అందిస్తారు. భయపడిన క్యాషియర్ దుండగులు ఇచ్చిన బ్యాగులో డబ్బులు నింపి వారికి ఇస్తాడు.
బ్యాగ్ తీసుకున్న ఇద్దరు దుండగులు క్షణాల్లో బ్యాంకులో నుంచి పారిపోయిన దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైనవి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దోపిడీ తీరును పరిశీలించారు. కెమెరాలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా దుండగులను పట్టుకునే పనిలో ఉన్నట్లు స్థానిక పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు.