BRS: తెలంగాణలో వలసల పర్వం మొదలైంది. బీఆర్ఎస్ నుంచి భారీగా అభ్యర్థులు జంప్ అవుతున్నారు. చివరి నిమిషం దాకా టికెట్ కోసం ప్రయత్నాలు చేసి రాకపోవడంతో కండువా మార్చేస్తున్నారు రాజకీయ నాయకులు. కొందరు పార్టీలో ఉంటూనే ఇతర పార్టీలతో అంతర్గత సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో, ఏ కండువా కప్పుకుంటారో అర్థం కాని పరిస్థితి.
పార్టీ కోసం పనిచేస్తామంటూనే తెల్లారేసరికి పార్టీ మారుతున్నారు ఇంకొందరు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో అయిదారుగురుకి తప్ప అందరికీ మళ్లీ టికెట్లు ఇస్తామని కేసీఆర్ చాలా సార్లు చెప్పారు. అయినా పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించడం ఫలానా అభ్యర్థికి టికెట్ ఇస్తే తాము పనిచేయబోమని బెదిరించడం వంటి ఘటనలు జరుగుతున్నాయి.
మంత్రి కేటీఆర్ కల్పించుకుని ఏవేవో హామీలు గుప్పిస్తున్నా కూడా నేతలు ఏమాత్రం ఆగడం లేదు. ఈ చేరికలు చూస్తుంటే బీఆర్ఎస్ నిలుస్తుందా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమావుతున్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన మాదాపూర్, హఫీజ్ పేట కార్పొరేటర్ దంపతులు జగదీశ్వర్ గౌడ్, పూజిత గౌడ్ కాంగ్రెస్ గూటికి చేరారు. నిజానికి ఇది బీఆర్ఎస్ కి పెద్ద దెబ్బ. నియోజకవర్గంలోని చాలా ప్రాంతాలలో జగదీశ్వర్ గౌడ్ కి సత్సంబంధాలు మెండుగా ఉన్నాయి.
మరోవైపు ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయ రెడ్డి గతంలోనే కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ఇక ఈస్ట్ ఆనంద్ బాగ్ కార్పొరేటర్ ప్రేమ్ కుమార్, మచ్చ బొల్లారం కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక బోద్ ఎమ్మెల్యే బాపూరావు కూడా బీఆర్ఎస్ ను వీడి ఈ మధ్యనే కాంగ్రెస్లో చేరారు. ఈ వలసలు చూస్తుంటే వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ నిలవడం కష్టమే అంటున్నారు రాజకీయ వర్గాలవారు. మరి ఈ విషయంపై కేటీఆర్, కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.