Rohit Sharma: భారత్-శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డేలో చివరి ఓవర్లో హైడ్రామా చోటుచేసుకుంది. ఈ మ్యాచ్లో శ్రీలంక ఓడినా ఆ జట్టు కెప్టెన్ పోరాటం అందరినీ ఆకట్టుకుంది. అయితే శ్రీలంక ఇన్నింగ్స్ చివరి ఓవర్లో కెప్టెన్ షనక 98 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 50 ఓవర్ను టీమిండియా బౌలర్ మహమ్మద్ షమీ బౌలింగ్ చేస్తున్నాడు. మొదటి మూడు బంతులు పూర్తయ్యాయి. నాలుగో బంతి వేసేందుకు షమీ రెడీ అయ్యాడు. కానీ షనక సెంచరీ మీదే దృష్టి పెట్టాడు.
అటు షనక సెంచరీని అడ్డుకునేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డర్లను సర్కిల్ లోపల పెట్టాడు. అయితే షమీ బంతి వేయక ముందే షనక క్రీజు దాటాడు. ఇది గమనించిన షమీ.. మన్కడింగ్ పద్ధతిలో రనౌట్ చేసి అప్పీల్ చేశాడు. దాంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్కు నివేదించాడు. అంతలోనే కెప్టెన్ రోహిత్ శర్మ జోక్యం చేసుకోని ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు. బౌలర్ షమీ చేత అప్పీల్ను వెనక్కి తీసుకున్నాడు.
అనంతరం ఆట కొనసాగగా.. షనక బౌండరీతో వన్డే కెరీర్లో తన రెండో సెంచరీని పూర్తి చేశాడు. ఒకవేళ రోహిత్ శర్మ అప్పీల్ వెనక్కి తీసుకోకపోయి ఉంటే.. క్రికెట్ నిబంధనల ప్రకారం షనక ఔటయ్యేవాడు. అప్పుడు అతడి సెంచరీ పూర్తయ్యేది కాదు. కాగా సెంచరీ అనంతరం షనకను ప్రత్యేకంగా రోహిత్ శర్మ అభినందించాడు. కాగా మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షమీ ఇలా మన్కడింగ్ చేస్తాడని ఊహించలేదన్నాడు. 98 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న షనకను ఇలా ఔట్ చేయడం సరికాదని భావించే అప్పీల్ను వెనక్కి తీసుకున్నామని స్పష్టం చేశాడు.
బౌలర్లు మరింత మెరుగ్గా రాణించాలి
ఈ మ్యాచ్లో తమ బౌలర్లు ఇంకాస్త మెరుగ్గా బౌలింగ్ చేయాల్సిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్ విభాగం అద్భుతంగా రాణించిందని చెప్పిన రోహిత్.. కఠిన పరిస్థితుల్లో బౌలర్లు రాణించలేకపోయారని తెలిపాడు. జట్టు ఫీల్డింగ్ కూడా మెరుగుపడాలని, జట్టులోని ప్రతి ఒక్కరు సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉందన్నాడు.