YCP MLA: ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు వేడివేడిగా సాగుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు మరింత వేడిగా మారుతున్నాయి. ఇక అధికార, ప్రతిపక్ష పార్టీలో ఒకరిపై ఒకరు విమర్శలు గుర్తించుకుంటున్నారు. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా పెనమలూరు సమన్వయకర్తగా మంత్రి జోగి రమేశ్ను అధిష్ఠానం నియమించింది. ఈ నేపథ్యంలో పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ.. సొంత పార్టీపై విమర్శలను గుప్పించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై దౌర్జన్యాలు చేయకపోవడం, అసభ్య పదజాలం వాడకపోవడమే నా అసమర్థతా? వైకాపాలో బీసీలకు అగ్ర తాంబూలం నేతి బీరకాయలో నెయ్యి చందమే.
గన్నవరంలో పార్టీ గెలిచే పరిస్థితి లేదని నన్ను వెళ్లమని అన్నారు. బీసీ నేతను కాబట్టి అక్కడ ఓడినా పర్లేదని భావించారు. నేను వెళ్లేందుకు విభేదించడం పార్టీకి నచ్చలేదు. బలహీన వర్గాలకు పార్టీలో గుర్తింపు ఉంటుందని గతంలో చెప్పాను. అది తప్పని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. బీసీ, ఎస్సీలు ఎవరి కాళ్లపై వారు నిలబడాలని అనుకుంటారు. మరొకరి పెత్తనంపై ఆధారపడాల్సి వస్తే ఆత్మాభిమానం చంపుకోరు అని ఆయన తెలిపారు. కాగా పార్థసారథి చేసిన వాఖ్యలు మీడియాలో వైరల్ అవ్వడంతో తెదేపాలో పార్థసారథి చేరడం ఖాయమని తెలుస్తోంది.
అయితే ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్యనేతలు ఆయనతో చర్చించారు. వారు తెదేపాలోకి ఆహ్వానించగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ నెల 18న కృష్ణా జిల్లా గుడివాడలో తెదేపా అధినేత చంద్రబాబు రా.. కదలి రా బహిరంగ సభ జరగనుంది. ఆ వేదిక మీదే పార్థసారథి తెదేపాలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. ఒకవేళ అదే గనుక నిజమైతే వైసీపీకి ఊహించని షాక్ ఎదురైనట్టే అని చెప్పవచ్చు.