Surya Kumar: టీమిండియా యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఫామ్లో ఉన్నాడు. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకుల్లో నంబర్వన్గా కొనసాగుతున్నాడు. మైదానంలో ఎడాపెడా షాట్లు ఆడే సూర్యకుమార్కు అభిమానులు మిస్టర్ 360 అని నామకరణం కూడా చేశారు. అయితే తన సక్సెస్ కారణం ఎవరో తాజాగా సూర్యకుమార్ చెప్పాడు. తన పెళ్లామే తనను నడిపిస్తోందని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశాడు. తనను మోటివేట్ చేస్తూ.. తన ఏకాగ్రత చెదరకుండా తన భార్య దేవిషాశెట్టి చూసుకుంటోందని వెల్లడించాడు.
ప్రస్తుతం సూర్యకుమార్ న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నాడు. నవంబర్ 17న దేవిషాశెట్టి పుట్టినరోజు కావడంతో తన భార్యకు అతడు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ చేశాడు. దేవిషాతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ తన అందమైన భార్యకు విషెస్ తెలిపాడు. తన ప్రతి సమస్యను పరిష్కరించే వ్యక్తి అంటూ భార్య దేవిషాశెట్టిని సూర్యకుమార్ ఆకాశానికెత్తేశాడు.
తాను ఆటపై ఫోకస్ పెట్టేలా.. గర్వం తలకెక్కకుండా భూమి మీదనే ఉండేలా దేవిషా చేస్తోందని సూర్యకుమార్ రాసుకొచ్చాడు. నిజంగా చెప్పాలంటే ఆమె లేకుండా తాను పీకిందేమీ లేదన్నాడు. ఆమె తనకు భార్యగా దొరకడం తాను చేసుకున్న అదృష్టమని పేర్కొన్నాడు. తన భార్య లేకుండా తాను ఏమవుతానో ఊహించుకోలేనని.. తనకు దక్కిన అతిపెద్ద బహుమతి తన భార్యేనని.. ఆమె బర్త్డేను సెలబ్రేట్ చేసుకుంటున్నానని తన పోస్టులో వివరించాడు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న సూర్యకుమార్
2016, జులై 7న సూర్యకుమార్, దేవిషా వివాహం చేసుకున్నారు. వీళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఎంతోమంది సెలబ్రిటీలు వీరి వివాహానికి హాజరయ్యారు. 2012లో కాలేజీ రోజుల్లోనే సూర్యకుమార్, దేవిషా తొలిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత వీళ్ల స్నేహం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. ఆరేళ్లుగా వీళ్లు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్కప్లో విరాట్ కోహ్లి తర్వాత అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా సూర్యకుమార్ నిలిచాడు. ఆరు మ్యాచ్లలో 59 సగటుతో 239 పరుగులు చేశాడు. అందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.