TDP: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ, టికెట్ల లెక్కలు, గెలుపోటముల మూడ్ తెలిసిపోతోంది. వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ఇప్పటికే పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చి ప్రజల్లో తిరగాలని వర్క్ షాపులు నిర్వహిస్తున్నారు. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం పార్టీ నేతలను అలర్ట్ చేశారు. అయితే నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మాత్రం టీడీపీ పరిస్థితి మాత్రం అంతంగా బాగోలేదని టాక్ వినిపిస్తోంది. అయితే ఇక్కడ ఎవరు వైసీపీకి ప్రత్యామ్నాయమనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మారింది.
భూమా ఫ్యామిలీకి ఆళ్లగడ్డ నియోజకవర్గం కంచుకోట. భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి చనిపోయిన తర్వాత ఆ బాధ్యలను వారసులు తీసుకున్నారు. గత ప్రభుత్వ హాయంలో భూమా అఖిల ప్రియ మంత్రవర్గంలోనూ ఉంది. కానీ ఆళ్లగడ్డ ప్రజల మన్ననలు మాత్రం అంతంగా పొందలేకపోయిందని చెప్పవచ్చు. ఆ తర్వాత హైదరాబాద్ లో ల్యాండ్ ఇష్యు, ఏవీ సుబ్బారెడ్డి కుటుంబంతో గొడవలు ఇలా కాలం వెళ్లదీస్తూ, పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనటం లేదు. దీంతో ప్రజలు ఆమెను మరిచిపోయారనే భావన స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక అధికార పార్టీ వైసీపీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఇంఛార్జి భూమా కిశోర్రెడ్డి ఎదుగుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పల్లెబాట పేరుతో ఆళ్లగడ్డ నియోజకవర్గం అంతా కలియ తిరుగుతున్నారు. ప్రజాసమస్యలను తెలుసుకుంటూ, తనకు చేతనైన మేరకు పరిష్కారానికి కృషి చేశారు. భూమా వారసుడిగా జనంతో మమేకం అయ్యేందుకు మార్గం సుగుమమైంది.
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బ్రిజేంద్రనాథ్రెడ్డిని ఎదుర్కోవడంలో ఆ నియోజకవర్గ సరైన ప్రతిపక్షం లేకుండా పోయింది. దీంతో ఇదే అవకాశంగా తీసుకున్న భూమా కిశోర్రెడ్డి బీజేపీ ఇంఛార్జి హోదాలో జనానికి చేరువయ్యే ప్రయత్నానికి ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు ఆళ్లగడ్డలో పోటీ ఎవరి మధ్య అని ప్రశ్నిస్తే టక్కున వైసీపీ వర్సెస్ భూమా కిశోర్ అనే సమాధానం వస్తోంది.