YCP MLA: ఒక్క వివాదం వైసీపీ ఎమ్మెల్యే గ్రాఫ్ను ఒక్కసారిగా పడేసిందా? అంటే ప్రస్తుతం అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలకమైన నియోజకవర్గం వినుకొండలో కొన్ని రోజుల కిందట టీడీపీ వర్సెస్ వైసీపీ నేతల మధ్య తీవ్ర వివాదం తెరమీదికి వచ్చిన విషయం తెలిసిందే. టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర 2000 కిలో మీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వినుకొండలో సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు దిగారని టీడీపీ నాయకులు ఆరోపించారు.
అది కాస్త పెను వివాదంగా మారి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, టీడీపీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మధ్య తీవ్ర వివాదం రేగింది. దాంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపే వరకు కూడా ఈ వివాదం కొనసాగింది. అయితే మొత్తానికి రెండు మూడు రోజుల పాటు ఉద్రిక్తతలు కొనసాగాయి. తర్వాత కొంత ఈ వివాదం తెరిపిచ్చింది. అయితే ఈ ఘర్షణ కారణం వైసీపీ ఎమ్మెల్యే తన గ్రాఫ్ పెరుగుతుందని తన సత్తా పెరుగుతుందని భావించి ఉంటారని పరిశీలకులు అంటున్నారు. వాస్తవానికి ఇప్పుడు ఎమ్మెల్యే వ్యవహారంపై ప్రజల్లో అసంతృప్తి రేగిందని అంటున్నారు.
ఎందుకంటే గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు బొల్లా సహా వైసీపీ నాయకులు అనేక కార్యక్రమాలు చేపట్టారు. అప్పుడు వినుకొండలో ఒక్క వివాదం కానీ పోలీసులు కాల్పలకు దిగడం కానీ జరగలేదని ఇక్కడి వారు చెబుతున్నారు. కానీ, ఇప్పుడు ప్రశాంతమైన వినుకొండ అశాంతికి నెలవుగా మారడం వెనుక కక్ష పూరిత రాజకీయాలు ఉన్నాయని ఇక్కడి ప్రజలు భావిస్తున్నట్టు పరిశీలకులు చెబుతున్నారు. ఇదే విషయంపై కొన్ని ఆన్లైన్ చానెళ్లు ముఖ్యంగాబొల్లాకు అనుకూలంగా ఉన్న చానెళ్లు సర్వే చేయగా తమకు ప్రశాంతత కావాలని కొట్టుకునే నాయకులు తమకు అవసరం లేదని ప్రజలు తేల్చి చెప్పారట. అంతేకాదు ఎమ్మెల్యే బాధ్యతగా వ్యవహరించాలని ఎక్కువ మంది సూచించినట్టు సమాచారం. మొత్తంగా చూస్తే.. బొల్లా దూకుడుతో ఆయన గ్రాఫ్ పడిపోయిందని మెజారిటీ వర్గాలు చెబుతున్నాయి.