Lokesh: యువ గళం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మహాశక్తి అనే పేరిట ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాలకు చెందినటువంటి మహిళలు పాల్గొని పలు విషయాల గురించి లోకేష్ గారిని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఒక సైకాలజిస్ట్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు.
ప్రస్తుత కాలంలో పిల్లలకు విద్యావ్యవస్థలో మానసిక, శారీరక సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఓ మహిళా సైకాలజిస్ట్ అభిప్రాయపడ్డారు. ఈ అంశాలు నిర్లక్ష్యం చేయడంతో పిల్లలు డిప్రెషన్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, బాడీ షేమింగ్, బాడీ డిస్మార్ఫియాలకు గురవుతున్నారని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇతర దేశాలలో విద్యావ్యవస్థలో ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఒక భాగంగా ఉండాలని చాలా దేశాలు నిర్ణయించాలని, ఆ సబ్జెక్టు కూడా కచ్చితంగా పాస్ అవ్వాలని నిబంధన పెట్టాయని వెల్లడించారు.
ఈ క్రమంలోనే రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వస్తే విద్యా వ్యవస్థలో ఈ విధమైనటువంటి మార్పులు తీసుకురావాలని సూచించారు. అయితే ఈమె మాటలు విన్నటువంటి నారా లోకేష్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేజీ నుంచి పీజీ వరకు పూర్తిగా సిలబస్ మార్చేస్తానని తెలిపారు. ఫిన్ ల్యాండ్ మాదిరి సమగ్ర విద్యా విధానంపై దృష్టి పెడతామని, ఆ దేశవాసుల నైతిక విలువలను టీడీపీ కూడా పాటిస్తుందని చెప్పారు. ఇక బాడీ షేమింగ్ గురించి మాట్లాడుతూ తన శరీరాకృతి గురించి కూడా ఎన్నో విమర్శలు చేశారని ఈయన ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం లోకేష్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.