Veerasimha Reddy: నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి. సంక్రాంతి కానుకగా ఈరోజు విడుదలైంది. సాధారణంగా బాలయ్య మూవీ అంటేనే అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. యాక్షన్ సీన్ల విషయంలో దర్శకులు కూడా రెచ్చిపోతారు. ఇక ఫ్యాక్షన్ మూవీలకు బాలకృష్ణ పెట్టింది పేరు. ఈ తరహా అనేక చిత్రాలను తీసి సంచలన విజయాలు నమోదు చేశారు బాలయ్య. ఇదే నేపథ్యంలో వీరసింహారెడ్డి చిత్రం తీశారు. అయితే, ఈ చిత్రంపై మిశ్రమ స్పందన వస్తోంది. బాలయ్య అభిమానులకు పండగ వాతావరణం ఏర్పడింది. కానీ సాధారణ ప్రేక్షకులు ఈ సినిమాపై భిన్నంగా స్పందిస్తున్నారు.
ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగిన ఈ చిత్రంలో ప్రతి సీన్లోనూ రక్తపాతం జరిగిందనే విశ్లేషణ వస్తోంది. బాలయ్య అభిమానులకు విందుగా ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను చూడలేకపోతున్నారని చెబుతున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేని ఇంతకు ముందు అనేక చిత్రాలు తీశాడు. అయితే, బాలకృష్ణ లాంటి పెద్ద హీరోలతో చేయడం ఇదే తొలిసారి. అయితే, కొత్త కథను తయారు చేసుకోకుండా కేవలం బాలకృష్ణ ఇంతకుముందు సినిమాల్లోని సీన్లను ఎత్తుకొని మిక్సీలో వేసి వీరసింహారెడ్డి పేరుతో రిలీజ్ చేశాడనే విశ్లేషణలు వస్తున్నాయి.
సినిమాలో ఆసాంతం హింస కనిపించింది. అభిమానులు, మాస్ అనే పేరు చెప్పి.. దర్శకుడు ఇలా చేయడం సరికాదని ప్రేక్షకులు చెబుతున్నారు. అభిమానులను అలరించడానికి కొన్ని మాస్ ఎలిమెంట్స్తో కూడిన డైలాగులు రాసుకున్నాడని చెబుతున్నారు. సినిమాలో, కథలో మాత్రం దమ్ము లేదని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా లెజెండ్ సినిమాలో బాలకృష్ణ గెటప్ను ఈ సినిమాలో దించేశాడని చెబుతున్నారు.
ఏపీ సీఎం జగన్పై డైలాగులు..
కథ కూడా ఇలాగే ఉందని ఫ్యాన్స్ కూడా చెబుతున్నారు. మితిమీరిన యాక్షన్, డ్రామా సినిమాకు మైనస్ పాయింట్లుగా చెబుతున్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వంపై సినిమాలో డైలాగులు పేల్చాడని చెబుతున్నారు. పరిశ్రమలు ఏపీ నుంచి వెళ్లిపోతున్నాయని చెబుతూ డైలాగులు చెప్పారు బాలయ్య. మొత్తానికి వీరసింహారెడ్డి చిత్రం బాక్సీఫీసు వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.