రాజకీయాల గురించి అంతో ఇంతో అవగాహన ఉన్నవారికి ప్రశాంత్ కిషోర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐప్యాక్ పేరుతో పొలిటికల్ కన్సల్టెన్సీ ని ఏర్పాటు చేసి రాజకీయ వ్యూహకర్తగా ఎన్నో పార్టీలకు సేవలను అందించారు. ప్రధాని మోడీతో సహా కేజ్రీవాల్, మమతా బెనర్జీ, స్టాలిన్ సహా ఏపీలో జగన్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా కూడా వ్యవహరించారు ప్రశాంత్. కానీ గత ఏడాది కాలంగా ఆయన ఐప్యాక్ మేనేజ్మెంట్ బాధ్యతల నుంచి పూర్తిగా వైదొలగి,కేవలం తన సొంత రాష్ట్రం అయిన బీహార్లో జనసు రాజ్ పేరుతో రాజకీయ వేదికను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
కొంతమంది టీమ్తో కలిసి రాజకీయాలపై ఆసక్తి గలిగిన యువతతో కలిసి ఆ రాష్ట్రంలో పాదయాత్ర పేరుతో ప్రజలతో మమేకం అవుతున్నారు ప్రశాంత్. బీహార్ రాజకీయ యవనికపై తనదైన ముద్రను లిఖించాలని ప్రశాంత్ కిషోర్ అంతిమ లక్ష్యంగా పెట్టుకున్నారు. అలా ప్రస్తుతం ప్రశాంత్ బీహార్ రాజకీయాల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. తాను నెలకొల్పిన సంస్థ ఐప్యాక్ నుంచి వైదొలిగిన ప్రశాంత్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలపై మరోసారి పీకే దృష్టి పెట్టబోతున్నారన్నది కేవలం ఒక వర్గం వారు ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన లక్ష్యం బీహార్ రాజకీయాలు. బీహార్ పాలిటిక్స్ లో తనదైన మార్క్ చూపించడం కోసం తెగ ప్రయత్నిస్తున్నారు ప్రశాంత్. అయితే ఈ పరిస్థితుల్లో ఏపీ రాజకీయాల్లో తలదూర్చే ఆలోచన పీకేకు లేదన్నది అతని సహచరుల మాట.
కాబట్టి గతంలో తాను పనిచేసిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ప్రస్తుత ఏపీ సీఎం వైయస్ జగన్కు వ్యతిరేకంగా సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశమే లేదు. జగన్ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు ఏ కారణం లేక టీడీపీ అలాగే ఎల్లో మీడియా పీకే పేరును తమ స్వార్థం కోసం వినియోగించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం వైయస్ జగన్ సారథ్యంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ దశలో టీడీపీకి అనేక జిల్లాల్లో కనీసం పోటీలో నిలిచేందుకు అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికారపార్టీని ఇరుకున పెట్టేందుకు ఎలాంటి అంశం లేకపోవడంతో చంద్రబాబు అండ్ కో ప్రశాంత్ కిషోర్ పేరును తెరపైకి తెచ్చింది.