Prashanth Kishor: వైనాట్175 అంటూ జగన్ ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నాయకులు కూడా ఏడాదిన్నరగా ఇదే నినాదం ఎత్తుకున్నారు. పేరుకే 175 అంటున్నారు కానీ.. అంతసీన్ లేదని వారికి కూడా తెలుసు. అసలు అధికారంలోకి వచ్చే అవకాశం లేదని చాలా మంది పార్టీ మారిపోతున్నారు. కానీ, జగన్ మీద నమ్మకంతో కనీసం అత్తెసరు మెజార్టీతోనైనా అధికారంలోకి వస్తామని కొంతమంది వైసీపీ నేతలు అనుకుంటున్నారు. సంక్షేమ పథకాలే శ్రీరామరక్షగా భావిస్తూ మరోసారి అధికారంలోకి వస్తామని చెబుతున్నారు. అయితే అంత సీన్ లేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓటమి గ్యారంటీ అని తేల్చేశారు. అలా అని ఏదో చెప్పాలని చెప్పలేదు. ఈసారి జగన్ ఓటమికి స్పష్టమైన కారణాలు కూడా ఆయన చెప్పారు. బటన్ నొక్కే పాలిటిక్స్నే నమ్ముకున్న జగన్ అభివృద్ధిని అటకెక్కించారని పీకే విమర్శించారు.
ఏపీ రాజకీయాలపైన, ప్రజల ఆలోచనలపై ఓ అవగాహనతోనే ప్రశాంత్ కిశోర్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమని విశ్లేషించారు. ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కూటమిదే విజయమని వ్యాఖ్యానించారు . అంతేకాదు జగన్ తనకు తాను రాజాగా భావిస్తున్నారని… ఆయన గెలవడం కష్టమని స్పష్టం చేశారు. అప్పు తెచ్చి అయినా.. ప్రజలకు నగదు అందజేస్తున్నానని.. అందుకే ప్రజలు తప్పక గెలిపిస్తారనే భ్రమలో ఆయన ఉన్నారని పీకే అన్నారు. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ మాదిరిగా ప్రజలకు డబ్బు పంపిణీ చేస్తే గెలుస్తామనకుంటున్న జగన్ భ్రమలు త్వరలోనే తొలగిపోతాయని చెప్పారు.
మాజీ సీఎం బఘేల్ వలే.. ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి బదులు నియోజకవర్గాలకు ప్రొవైడర్ మోడ్లోనే జగన్ ఉండిపోయారని ఈ సందర్భంగా పీకే గుర్తు చేశారు… గతంలో రాజుల్లా.. తాయిలాలతోనే సరిపెట్టడం తప్పితే ఇంకా ఏం చేయలేదన్నారు. ప్రజలకు నగదు బదిలీ చేశారు తప్పితే.. ఉద్యోగాలు కల్పించడం, రాష్ట్రాభివృద్ధిపై ఆయన శ్రద్ద పెట్టలేదని ప్రశాంత్ కిషోర్ వివరించారు. ఏపీ రాజకీయాలపై పీకేకి ఓ అవగాహన ఉంది. ప్రశాంత్కిషోర్ గత ఎన్నికల్లో వైసీపీ రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ అధినేత జగన్ ఐ ప్యాక్ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను ఆశ్రయించారు. అగ్రిమెంట్ కుదరడంతో పీకే టీం రాష్ట్రంలో దిగింది. ఆ టీం స్క్రిప్ట్ ప్రకారమే వైయస్ జగన్ అడుగులు వేశారు. దాంతో 2019 ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ఆ క్రమంలో ఎన్నికల తర్వాత జగన్ స్వయంగా పీకేని కలిసి థాంక్స్ కూడా చెప్పివచ్చారు. అయితే సీఎం పగ్గాలు చేపట్టిన నాటి నుంచి జగన్ సంక్షేమాన్నే నమ్ముకుని .. నవరత్నాల అమలుకు రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో ముంచారన్న విమర్శలున్నాయి. బటన్ నొక్కి తాను ట్రాన్స్ఫర్ చేస్తున్న డబ్బుల గురించే ఈ సారి ఎన్నికల్లో ఎక్కువగా ప్రచారం చేసుకుంటున్నారు. అదే విషయాన్ని స్పష్టం చేసిన పీకే .. ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పేశారు
అయితే, ప్రశాంత్ కిషోర్ కామెంట్స్పై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఒకరొకరుగా రియాక్ట్ అవుతూ పీకేపై నిప్పులు కురిపిస్తున్నారు. వాట్ నాసెన్స్ అంటూ మంత్రి బొత్సా ఫైర్ అయ్యారు. తాము వ్యూహకర్త డ్యూటీ నుంచి పీకేని పీకేసామని.. ఆయన తమ పార్టీనికి నెగెటివ్ గా మాట్లాడుతున్నారని అన్నారు. అంతేకాదు.. పీకే కామెంట్స్ వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు. పీకేని బీహర్ లో తరిమేస్తే.. ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుత్నారని తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్.. తమ పార్టీకి పని చేసినపుడు గొప్ప వ్యూహకర్తగా.. ఇప్పుడు పనికిరాని వ్యూహకర్తగా వైసీపీ ప్రచారం చేస్తోంది. పీకే విషయం పక్కన పెడితే.. ఇప్పటికే చాలా సర్వేలు.. వైసీపీ ఓటమిని ఖాయం చేస్తూ తమ ఫలితాలు చెప్పాయి. ఇలా ఎంతమంది వైసీపీ ఓడిపోతుందని చెబితే.. ఎంతమందిపై విమర్శలు చేస్తారు? వాస్తవాన్ని గ్రహించి తప్పులను సరిదిద్దుకోకపోతే వైసీపీకే నష్టం జరుగుతుంది. కానీ.. వాటిని గ్రహించే స్థితిలో వైసీపీ లేదు.