Rythu Bandhu: వానకాలం పంట పెట్టుబడి రైతుబంధు నిధులను జూన్ 26 నుంచి విడుదల చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. రైతులకు ఎప్పటిలాగే నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. అందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖమంత్రి హరీశ్ రావును, అదనపు ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావును కూడా సీఎం కేసీఆర్ ఆదేశించారు. అయితే కొత్తగా పట్టాదార్ పాస్ బుక్ వచ్చిన రైతులకు ఈ వానాకాలం సీజన్లో రైతుబంధుకు అవకాశం కల్పించారు.
జూన్ 16 నాటికి పాస్ బుక్ వచ్చిన ప్రతీ రైతుకు రైతుబంధు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం కింద సాయం పొందడానికి కొత్త పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్సు కాపీలను స్థానిక ఏఈవోలకు అందజేయాల్సి ఉంటుంది. బుధవారం నుంచే ఏఈవోలకు రైతుబంధు పోర్టల్లో ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చారు. సీసీఎల్ఏ డేటా ఆధారంగా రైతులను గుర్తిస్తారు. రైతు పట్టాదారు పాస్బుక్ వివరాలను రైతుబంధు పోర్టల్లో అప్లోడ్ చేస్తారు.
రాష్ట్రంలో సీసీఎల్ఏలో నమోదైన పట్టాదారు పాసు పుస్తకాలు కలిగిన 68.94 లక్షలకు పైగా రైతులు రైతుబంధుకు అర్హులుగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కొత్త లబ్ధిదారుల నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో ఈనెల 26 నుంచే రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.