Roja: సినీ పరిశ్రమ నుంచి దూరమైన హీరోయిన్ రోజా.. ప్రస్తుతం రాజకీయాల్లోనే రాణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతూ అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. అయితే గురువారం రోజా తన పుట్టిన రోజు సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకుంది. రోజాతోపాటు ఆమె సన్నిహితులు, ప్రముఖ సింగ్ మంగ్లీ, మంగ్లీ చెల్లెలు, జబర్దస్త్ వర్ష శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రోజా.. తన కొడుకు, కూతురిపై భవిష్యత్కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది.
మీడియాతో రోజా మాట్లాడుతూ.. ‘తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల తిరుపతి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చినా.. స్వామి వారిని చూస్తూ ఉండాలనిపిస్తుంటుంది. స్వామివారి దివ్యరూపం మర్చిపోలేనిది. రోజూ చూడాలని అనిపిస్తుంటుంది. ఇక్కడి వారు స్వామి వారే దైవమని కొలుస్తుంటారు. ఇంట్లో వ్యక్తిగా భావిస్తారు. నేను తిరుపతిలోనే పుట్టడం, పెరగడం, చదువుకోవడం నా అదృష్టం. ఇప్పుడు ఏపీకి మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.’ అని పేర్కొన్నారు.
తిరుమల స్వామి వారి ఆశీస్సులతో రాజకీయంగా ఎదుగుతున్నానని మంత్రి రోజా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా రోజా తన కూతురు అన్షు మాలిక సినీ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేసింది. తన కూతురు, కొడుకు యాక్టింగ్ చేయాలని అనుకుంటే సంతోష పడతానని చెప్పింది. ‘నా పిల్లలు పెద్ద చదువులు చదువుకోవాలి. గొప్ప సైంటిస్టులు అవ్వాలి. ప్రస్తుతం ఇద్దరూ బాగా చదువుకుంటున్నారు. ఒకవేళ వాళ్లకు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని అనుకుంటే.. తప్పకుండా సహకరిస్తాను. ప్రస్తుతానికైతే పిల్లల్లో అలాంటి ఆలోచన లేదు.’ అని చెప్పుకొచ్చింది. కాగా, రోజా తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. స్నేహితులు, సన్నిహితుల మధ్య వేడుకలు నిర్వహించారు. కేక్కు బదులు ఫ్రూట్స్ కట్ చేసి బర్త్ డే వేడుకలు జరిపారు. వీటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన పుట్టిన రోజు వేడుకలను జరిపేందుకు వచ్చిన స్నేహితులు, శ్రేయోభిలాషులకు రోజా కృతజ్ఞతలు తెలిపారు.