Tirumala: ఈ మధ్యకాలంలో తిరుమలలో క్రూర మృగాల సంచరణ ఎక్కువ అయ్యింది. తిరుమల ఘాట్ రోడ్ లో నడక మార్గంలో చిరుత పులులు, పులులు, ఎలుగుబంట్లు ఎక్కువగా సంచరిస్తున్నాయి. దీంతో నడక మార్గంలో వెళ్లే భక్తులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. మొన్నటికి మొన్న ఒక చిన్నారిని చిరుత పులి లా కెళ్ళి పది మీటర్ల తర్వాత విడిచిపెట్టిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో చిన్నారి చాలా తీవ్రంగా గాయపడింది. తాజాగా ఒక చిన్నారిని చిరుత పులి చంపేసింది. అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం వారు కొన్ని షరతులను విధించారు.
భక్తుల డిమాండ్ మేరకు పిల్లల ప్రాణాల సంరక్షణకు టీటీడీ కఠినమైన చర్యలను చేపట్టింది. ఈ మేరకు ఇకపై 15 ఏళ్లలోపు పిల్లలతో ఏడుకొండలు ఎక్కాలంటే తల్లిదండ్రులు నిర్ణీత గడువులో నడక మార్గానికి చేరుకోవాల్సి ఉంటుందట. నడక దారిలో టీటీడీ ఉన్నతాధికారులు ఈ షరతులను విధించారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లల్ని నడక దారిలో అనుమతించరు. అలిపిరి నడక దారి, శ్రీవారి మెట్టు మార్గాల్లో ఇంత కాలం భక్తులు నడుచుకుంటూ వెళ్లి శ్రీవారిని దర్శించుకునేవారు. కొండకు నడుచుకుంటూ వస్తామని భక్తులు శ్రీవారికి మొక్కు పెట్టుకోవడం తెలిసిందే.
అయితే క్రూర మృగాల దాడుల్ని పరిగణలోకి తీసుకుని భక్తుల ప్రాణాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
కాగా తిరుమలలో రెండు రోజుల క్రితం నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల పాప లక్షిత, అలాగే నెల క్రితం ఐదేళ్ల బాలుడు చిరుత బారిన పడ్డారు. అయితే అదృష్టవ శాత్తు బాలుడు గాయాలతో బతికి బయట పడ్డాడు. కానీ చిన్నారి మాత్రం ప్రాణాలు కోల్పోయింది. దీంతో నడక దారిలో రక్షణ చర్యలు చేపట్టాలని టీటీడీపై పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వచ్చాయి.
అలాగే నెల క్రితం బాలుడికి ప్రమాదం జరిగినప్పుడే సురక్షిత చర్యలు చేపట్టి వుంటే, ఈరోజు బాలిక బలి అయ్యేది కాదనే విమర్శలు జోరుగా వినుపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ వెంటనే యాక్షన్ లోకి దిగడం గమనార్హం. కాబట్టి తిరుమల కొండకు నడిచి వెళ్లాలని భావించే భక్తులు, తమ పిల్లల వయసును బట్టి నిర్ణీత సమయంలోపు నడక మార్గాలకు చేరుకోవాలి.