Eenadu: ఏపీ సీఎం జగన్ చంద్రబాబు నాయుడుకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ద్వేషం ఉంది. చంద్రబాబునాయుడికి కూడా లేనంత ద్వేషం ఈనాడు తోక పత్రిక నింపుకుంది. నిత్యం విషపు సిరాతో రాతలు రాయడమే ఆ అంధ పత్రిక పనిగా పెట్టుకుంది. కాగా ఆ ద్వేషం చివరికి హిందువుల మనోభావాలను దెబ్బతీసేంతగా జారిపోయింది. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర వారం రోజులుగా అంగరంగ వైభవంగా సాగుతోంది.
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హిందూ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో కొలువైన శ్రీవేంకటేశ్వరస్వామి పాదాల చెంత తిరుపతిలో కొలువైన తాతయ్యగుంట గంగమ్మను భక్తులు ఎంతో ఇష్టంగా కొలుస్తారు.
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుని సొంత చెల్లిగా గంగమ్మను భావించి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. అందరూ తల్లిగా కొలిచే గంగమ్మ ప్రాశస్త్యాన్ని తక్కువ చేసేలా పచ్చ పత్రిక కథనం రాయడంపై భక్తులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. తాతయ్యగుంట గంగమ్మ ఆలయ ప్రాచీన చరిత్ర తెలిసిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వ పండుగగా ప్రకటింపజేశారు. దాంతో తాతయ్యగుంట గంగమ్మ తల్లి వైభవాన్ని మరింత పెంచినట్టు అయ్యింది. గతంలో ఎప్పుడు లేని విధంగా జాతరకు భక్తులు పోటెత్తారు. మరీ ముఖ్యంగా రూ.16 కోట్లతో ఆలయాన్ని అద్భుతంగా పునఃనిర్మిస్తున్నారు.
దీంతో జాతర ముగింపు రోజు తిరుపతి టాబ్లాయిడ్లో గంగమ్మ ఆలయంపై విషం చిమ్మడం భక్తుల్ని ఆగ్రహానికి గురి చేస్తోంది.దేశంలోనే గంగమ్మే తొలి గ్రామ దేవత. జాతరలు ప్రారంభమైంది ఇక్కడే. 1400 సంవత్సరాలకు పూర్వమే, తిరుపతి ఏర్పడక ముందే కొత్తూరు శివార్లలో గ్రామ రక్షణ కోసం వేంకటేశ్వరస్వామి ఆదేశాలతో గంగమ్మ గుడిని ఏర్పరిచినట్టు చరిత్ర చెబుతోంది. 900 ఏళ్ల క్రితం అనంతాళ్వారు స్వామి గంగమ్మ గుడిని పునఃప్రతిష్టించారు. ఈయన గురువైన తిరుమల నంబి వేంకటేశ్వర స్వామిని తాతా తాతా అని పిలిచేవాడు. ఆ తాత పేరున గంగమ్మ గుడి కోసం కోనేరు తవ్వించాడు. అందువల్లే ఈమె తాతయ్యగుంట గంగమ్మ దేవత అయ్యింది.
400 ఏళ్ల క్రితం భక్తులు ముందుగా గంగమ్మను సందర్శించుకున్న తర్వాతే తిరుమలకు వెళ్లేవారు అని భూమన కరుణాకరరెడ్డి కొంత కాలంగా గ్రామదేవత గురించి విస్తృతంగా ప్రచారం చేయడాన్ని ఎల్లో పత్రిక జీర్ణించుకోలేకపోయింది. కాగా తిరుపతి ఎమ్మెల్యే తన పార్టీ గురించో, లేక తన గురించో గొప్పలు చెప్పడం లేదనే కనీస స్పృహ ఆ పత్రికకు లేకపోయింది. ఈ ఆలయంలో నిర్మాణంలో భాగంగా ఇటీవలే రాతి స్తంభాలు బయటపడగా ఆ రాతి స్తంభాలపై వైష్ణవ సంప్రదాయ చిహ్నాలైన విష్ణుమూర్తుల బొమ్మలను గుర్తించారు. దీంతో వెంకటేశ్వరస్వామి చెల్లెలు గంగమ్మ అని నిర్ధారణ అయ్యింది. అలాగే ఇది అత్యంత పురాతన ఆలయని తేలిపోయింది. తిరుపతితో పాటు చుట్టుపక్కల నిర్మితమైన గోవిందరాజస్వామి, తిరుచానూరు అమ్మవారి ఆలయాల కంటే తాతయ్యగుంట గంగమ్మ ఆలయం పురాతన మైందని పురావస్తుశాఖ అధికారుల ప్రాథమిక పరిశోధనతో నిర్ధారణ అయ్యింది.ఫలానా వాళ్ల పుస్తకంలో గంగమ్మ ఆలయ ప్రస్తావన లేదు కాబట్టి, అసలు అక్కడ ఆ తల్లి ఆలయమే లేదని బుకాయించడం పచ్చ పత్రిక దిగజారుడుకు పరాకాష్ట.