Varahi: జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2024 ఎన్నికల బరిలో విజయం సాధించేందుకు ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. రాజకీయ యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు సమాయత్తమయ్యారు. అందుకోసం బస్సు యాత్రకు జనసేనాని సిద్దం అవుతున్నారు. తన యాత్రకు అనుకూలమైన బస్సును పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా డిజైన్ చేయించాడు.
జనసేనాని పవన్ కళ్యాణ్ తన బస్సుకు వారాహి అని నామకరణం చేశారు. ఈ బస్సును ప్రత్యేకంగా డిజైన్ చేయించాడు. హైదరాబాద్ లో రూపొందించిన ఈ బస్సులో ప్రత్యేక లైటింగ్, సీసీటీవీలు, ఆధునిక భద్రతా పరికరాలను అమర్చారు. 2024 ఎన్నికలకు ముందే రాష్ట్రమంతా ఈ బస్సు యాత్రను జనసేనాని చేపట్టనున్నారు.
గతంలో కూడా 1982లో టీడీపీ పెట్టినప్పుడు ఎన్టీఆర్ కూడా చైతన్య రథం తయారు చేయించి యాత్రను సాగించారు. అప్పట్లో ఆ వాహనాన్ని చూసేందుకు జనం పోటీపడేవారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బస్సు యాత్ర కోసం ప్రత్యేకంగా వాహనాన్ని తయారు చేయించారు. దుర్గాదేవి సప్తమాతలలో వారాహి ఒకరు కావడంతో ఆ పేరునే తన వాహనానికి పెట్టుకున్నారు. ఇటీవలె వైజాగ్ లో పవన్ పర్యటన సందర్భంగా లైట్లను ఆఫ్ చేయడం సంఘటనలు జరిగాయి.
గతంలో జరిగిన అన్ని విషయాలను ఆలోచించి ప్రత్యేకంగా జనసేనాని బస్సును తయారు చేయించారు. ఆధునిక సౌండ్ సిస్టమ్ తో వేలాది మంది పవన్ ప్రసంగాలను వినేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కొండగట్టులో పూజల అనంతరం వారాహిని ఏపీలోని జనసేన కార్యాలయానికి తరలించి అక్కడే ఉంచనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి తన యాత్రను కొనసాగించనున్నారు. ఈ వారాహి వాహనం తయారీకి సుమారు రూ.20 కోట్లు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. మొత్తానికి జనసేనాని ప్రచార రథం ప్రజల్లోకి వెళ్లడానికి సిద్దమైంది. ఈ వారాహి ద్వారా ప్రచారం నిర్వహించి వైసీపీ సర్కార్ ను గద్దె దింపాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్టుదలతో శ్రమిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా సాగి విజయం అందుకోవాలని భావిస్తున్నారు.