Virat Kohli: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఆడినా ఆడకున్నా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నాడు. నిన్నా మొన్నటి వరకూ అతడు ఫామ్లో లేడని.. ఇంక రాడని.. ఇక ఆడేయడం మానేస్తే బెటరని విశ్లేషణలు చేసిన క్రికెట్ పండితులు, విశ్లేషకులూ ఇప్పుడు కోహ్లీ అత్యద్భుత ఫామ్లో ఉన్నా.. గ్రౌండ్లో అతడు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్లో భాగంగా కోహ్లీ.. ఇటీవలే ముగిసిన బంగ్లాదేశ్తో మ్యాచ్లో అంపైర్కు హైట్ నోబాల్ గురించి రిఫర్ చేయడం, ఫేక్ ఫీల్డింగ్ వంటి ఆరోపణలతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నాడు.
బంగ్లాదేశ్తో మ్యాచ్లో కోహ్లీ.. భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హసన్ మహ్మద్ వేసిన ఓ బంతి నడుము కంటే ఎక్కువ ఎత్తులో రావడంంతో దానిని హైట్ నోబాల్గా పరిగణించాలని అంపైర్లను కోరాడు. అక్కడే ఉన్న అంపైర్ ఎరాస్మస్ దీనికి స్పందించి కోహ్లీ అభ్యర్థనకు ఆమోద ముద్రర వేశాడు. కానీ బంగ్లా సారథి షకిబ్ అల్ హసన్ మాత్రం ఈ విషయంలో ఎరాస్మస్ తో పాటు కోహ్లీతో వాగ్వాదానికి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇదే విషయమై పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు వసీం అక్రమ్, వకార్ యూనిస్లు స్పందిస్తూ.. ‘కోహ్లీ చాలా పెద్ద ఆటగాడు. అందుకే అతడు అడగడంతో అంపైర్లు ఒత్తిడికి గురయ్యారు’ అని ఏ స్పోర్ట్స్ లో జరిగిన టీవీ చర్చలో కామెంట్స్ చేశారు. ఇదే టోర్నీలో కోహ్లీ.. పాకిస్తాన్ తో మ్యాచ్ లో చివరి ఓవర్ వేసిన మహ్మద్ నవాజ్ బంతిని సిక్సర్ గా మలిచి దానిని హైట్ నోబాల్ గా ప్రకటించాలని అంపైర్లను కోరడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
ఇక ఈ అంశంతో పాటు కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడన్న ఆరోపణలపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) స్పందించింది. తాజాగా బీసీబీ క్రికెట్ ఆపరేషన్ చైర్మెన్ జలాల్ యూనుస్ క్రిక్ బజ్ తో మాట్లాడుతూ.. ‘కోహ్లీ వేసింది ఫేక్ త్రో నే. అది అంపైర్లకు చూసినా వాళ్లు తాము చూడలేదని రివ్యూకు వెళ్లలేదు. మేం దీని గురించి సరైన ఫోరమ్లో ఫిర్యాదు చేస్తాం..’ అని తెలిపాడు.
ఇవన్నీ చూస్తుంటే కోహ్లీ ఆడినా ఆడకున్నా అతడు వార్తల్లో వ్యక్తిగా మిగులుతూనే ఉన్నాడని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మెగా టోర్నీలో కోహ్లీ ఇప్పటివరకు 4 మ్యాచ్ లలో కలిపి 220 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలున్నాయి. ఈ మూడు మ్యాచ్ లలో కూడా కోహ్లీ నాటౌట్గా నిలవడం గమనార్హం.
View this post on Instagram