YS Jagan: ఏపీ, తెలంగాణలతో పాటు దేశంలో 9 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల నిర్వహణకు, ఆ తర్వాత లోక్సభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమీషన్ కసరత్తును ప్రారంభించింది. ఇప్పటికే కమీషన్ సభ్యులు గత నెల హైదరాబాద్కు వచ్చి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల గురించి చర్చించి, రిటర్నింగ్ అధికారుల జాబితా సిద్దం చేస్తే వారికి శిక్షణ ఇస్తామని చెప్పి వెళ్ళారు. జూన్ నెల నుంచి ఈవీఎంలన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో పరీక్షించి అవసరమైనవాటికి మరమత్తులు చేయాలని ఆదేశించారు. కేసీఆర్ ఇంతకముందు డిసెంబర్లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం వలన డిసెంబర్లో గానే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.
మూడు నెలల ముందు షెడ్యూల్, నోటిఫికేషన్ వెలువడుతుంది. అంటే సెప్టెంబర్ అక్టోబర్ మద్య ఎప్పుడైనా ఎన్నికల గంట మ్రోగవచ్చు. కాగా ఏపీలో గత ఎన్నికలలో వైసీపీకి కొన్ని రాజకీయ శక్తులు సహకరించడం, కొన్ని అంశాలు అనుకూలించడం, టీడీపీ ప్రభుత్వ రాజకీయ తప్పిదాలు లేదంటే ఇతర కారణాల వల్లో కానీ జగన్ సర్కార్ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అయితే ఆ ఎన్నికల నాటికి టీడీపీకి వ్యతిరేకంగా క్రమంగా పరిస్థితులు ఏవిదంగా మారాయో, ఇప్పుడు అదేవిదంగా జగన్ సర్కారుకు కూడా పరిస్థితులు మారుతున్నాయి. కనుక పరిస్థితులు చేయి దాటిపోక మునుపే ముందస్తు ఎన్నికలకి వెళ్ళవచ్చనే ఊహాగానాలు వినిపించాయి.
కానీ ముందస్తుకు వెళ్ళి ఓడిపోతే అనవసరంగా ఏడాది పదవీకాలం వదులుకొన్నట్లవుతుంది కనుక అవకాశం ఉన్నంతవరకు అధికారంలో కొనసాగడమే బెటర్ అని వైసీపీ సీనియర్ నేతలు లేదా ఐప్యాక్ సలహా ఇచ్చి ఉండవచ్చు. కనుక ఆ ఆలోచన విరమించుకొంది. అంటే ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగబోవడం లేదని స్పష్టం అయిందనుకోవచ్చు. వైసీపీకి రెండో ఛాన్స్ లభించదనే స్పష్టమైన సంకేతాలు కనబడుతున్నప్పుడు, అనూహ్యంగా లభించిన మొదటి ఛాన్స్ని పూర్తిగా సద్వినియోగించుకోవాలనుకోవడం చాలా తెలివైన నిర్ణయమే అని చెప్పండి వచ్చు.