Avinash Reddy: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేరు గత కొంతకాలంగా ఏపీలో మార్మోగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. వైఎస్ వివేకా హత్య కేసులో భాగంగా ప్రధానంగా అవినాష్ రెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. కాగా సిబిఐ అధికారులు వివేకా హత్య కేసులో మొదట్లో సాక్షిగా, తర్వాత నిందితుడిగా సీబీఐ కేసు నమోదు చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి శనివారం ఆయన స్వయంగా సీబీఐ అధికారుల ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలు వచ్చిన దరిమిలా తొలి శనివారం అనగా జూన్ 3వ తేదీ ఆయన సీబీఐ అధికారుల ముందు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు అవినాశ్ సీబీఐ ఎదుట హాజరయ్యారు. సాయంత్రం 4.30 గంటలకు విచారణ ముగిసింది. అయితే ఇప్పటికే ఐదు సార్లు విచారించిన సీబీఐ అధికారులు తాజా విచారణలో మాత్రం వాట్సాప్ కాల్స్, నిందితులతో పరిచయాల పై ప్రధానంగా ప్రశ్నించినట్లు సమాచారం. అడిషనల్ ఎస్పీ స్థాయిలో అధికారి సమక్షంలో విచారణ జరిగింది. విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియోలు సీబీఐ అధికారులు చిత్రీకరించారు. వివేకా దారుణ హత్యకు వినియోగించిన గొడ్డలి పై కూడా సీబీఐ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
సునీల్ యాదవ్ గొడ్డలి దాచిన విషయం పై ఆరా తీసినట్టు సమాచారం. వివేకా మరణంపై జగన్ మోహన్ రెడ్డికి ముందుగా ఎవరు చెప్పారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా సీబీఐ ప్రశ్నించినట్టు తెలిసింది. అయితే, తనకు, ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదని అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులకు గతంలో చెప్పినట్టే ఇప్పుడు కూడా చెప్పినట్లు తెలుస్తోంది. అవినాష్ స్టేట్మెంట్ ను సీబీఐ అధికారులు రికార్డ్ చేశారు. అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందుస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.