Pawan Kalyan: రాజకీయాల్లో ఏసి అడుగులు చూసే కోణాలు ఆలోచించే విధానం ఇవన్నీ కూడా ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాయి అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే రాజకీయాలు ఏ క్షణాన ఎలా మారిపోతాయో చెప్పడం అంచనా వేయడం చాలా కష్టం. ముఖ్యంగా కాకలు తీరిన రాజకీయ నాయకులుగా పేరున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటివారు, ఊరకరారు మహాను భావులు అన్నట్టుగా ఊరికేనే వారు ఏమీ చేయరు. ఎవరినీ పిలవరు. ఆమూలాగ్రం అన్ని కోణాల్లోనూ ఆలోచించుకునే వారు ప్రయత్నాలు చేస్తారు. రాజకీయం చూస్తారు.
అయితే ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయాన్ని కొంత లోతుగా చూస్తే ఆయనను కలుపుకొని వెళ్లేందుకు బీజేపీ ముందుకు వచ్చినట్టుగా కనిపిస్తోంది. తాజాగా జరిగిన ఢిల్లీ ఎన్డీయే కూటమి సమావేశానికి ఆయనకు ఆహ్వానం కూడా అందింది. దీంతో పవన్ అక్కడకు వెళ్లారు. అయితే దీనిపై సహజంగానే ఏపీలోని రాజకీయ పక్షాల నుంచి కొంత పెదవి విరుపులు కనిపించాయి. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్డీయేకూటమికి వెళ్లిన ఏకైక పార్టీ జనసేన, ఏకైకనాయకుడు కూడా పవనే కావడం గమనార్హం. దీంతో ఆయననే బీజేపీ ఎందుకు ఆహ్వానించింది. అసలు ఈ ఆహ్వానం వెనుక బీజేపీ చూస్తున్న యాంగిల్ ఏంటి? అనేది ఆసక్తిగా మారింది.
ఈ విషయంపై ఏపీలో అనేక రకాల అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ నేతలు ఈ విషయంపై అనేక రకాల విమర్శలు గుప్పించడంతో పాటు అనుమానాలను రేకెత్తిస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ కూడా సాగుతోంది. పవన్ కళ్యాణ్ను రాజకీయ కోణంలో చూస్తే ఆయన గత ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. పైగా ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచినా ఆయన కూడా పొరుగు పార్టీలో చేరిపోయారు. ఇక, క్షేత్రస్తాయిలో నిజాలు మాట్లాడుకుంటే బూత్ స్థాయి కమిటీలు లేవు, మండల స్థాయి యంత్రాంగం కూడా లేదు. ఇంటింటికీ తిరినే కార్యకర్తలు కూడా లేరు. పోనీ.. ఇవన్నీ కాకుండా ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే పోటీ చేసే సామర్థ్యం ఉన్న 100 మంది నాయకులుకూడా లేరు. అటువంటిది బీజేపీ పవన్ను చేరదీసింది. పైగా వచ్చే ఎన్నికలు కీలకం కదా! అంటే ఈ విషయంలో బీజేపీ రాజకీయంగా కన్నా ఆయనకు ఉన్న సినిమా ఇమేజ్ను చూస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పవన్ కళ్యాణ్ కు సినీ అభిమానులు, ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా వారు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్కు ఉన్న ఈ సినీ ఇమేజ్ను ఇరురాష్ట్రా లలోనూ వినియోగించుకోవాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు.