YCP Candidate: తాజాగా వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అహంపై తీవ్ర దెబ్బ పడింది. ప్రొద్దుటూరు రూరల్ మండలంలోని కొత్తపల్లె గ్రామ పంచాయతీలో 13వ వార్డు ఉప ఎన్నికను ఎమ్మెల్యే ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఊహించని విధంగా బొక్కబోర్లా పడ్డారు. శివప్రసాద్ రెడ్డి తాను చెప్పిందే చట్టం, చేసిందే శాసనం అనేలా వ్యవహరిస్తుండడంతో ఆయనపై ప్రజావ్యతిరేకతకు దారి తీస్తోందనే అభిప్రాయం ప్రస్తుతం వ్యక్తం అవుతోంది. శివప్రసాద్రెడ్డి తన మూలాల్ని విస్మరించి, ప్రొద్దుటూరులో మరొకరి ఉనికి లేకుండా చేయాలనే అహంభావంతో వ్యవహరిస్తున్నారని సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు అనుకునే పరిస్థితి వచ్చింది.
దీని ఫలితమే కొత్తపల్లె పంచాయతీలోని 13వ వార్డులో ఎమ్మెల్యే నిలబెట్టిన అభ్యర్థికి పరాజయం అని జనం చర్చించుకుంటున్నారు. నిజానికి 13వ వార్డులో ఓడింది ఎమ్మెల్యే నిలబెట్టిన అభ్యర్థి కాదని అని టాక్. కొత్తపల్లె సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డిని అణచివేయాలని ఎమ్మెల్యే భావించడమే ఆయన పతనానికి దారి తీస్తోందన్న సమాచారం. శివచంద్రారెడ్డి ప్రత్యర్థి పార్టీ అయితే అర్థం చేసుకోవచ్చు. వైఎస్సార్ కుటుంబానికి వీరాభిమాని. అతిపెద్ద గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ప్రాతినిథ్యం వహిస్తున్న వైసీపీ నాయకుడు. గతంలో వైసీపీ నాయకుడు ఎంవీ రమణారెడ్డికి వ్యతిరేకంగా కొత్తపల్లె పంచాయతీలో శివచంద్రారెడ్డిని ప్రోత్సహించారు.
అయితే గతంలో కొత్తపల్లె పంచాయతీలో డాక్టర్ ఎంవీ రమణారెడ్డి కోడలిపై శివచంద్రారెడ్డి పోటీ చేశారు. ఇద్దరూ వైసీపీ నేతలే. ఎమ్మెల్యే రాచమల్లు పెద్ద మనిషిగా వ్యవహరించాల్సింది పోయి, శివచంద్రారెడ్డికి బలపరిచి, ఆయనకు అన్ని రకాలుగా సాయం చేశారు. ఆ ఎన్నికల్లో శివచంద్రారెడ్డి వ్యక్తిగత ఇమేజ్ బాగా పని చేసి గెలుపొందారు. ఆ తర్వాత కాలంలో శివచంద్రారెడ్డిపై ఎమ్మెల్యే కోపం పెంచుకున్నారు. శివచంద్రారెడ్డికి వ్యతిరేకంగా వార్డు సభ్యుల్ని, ప్రభుత్వ ఉద్యోగుల్ని ఉసిగొల్పారు. పంచాయతీలో చేసే పనులకు బిల్లులు కాకుండా అడ్డుకున్నారు. దాదాపు 40 వేల ఓట్లున్న కొత్తపల్లె పంచాయతీ సర్పంచ్ను ఎమ్మెల్యే వ్యతిరేకం చేసుకోవడం అంటే రాజకీయంగా ప్రమాదకరమైన ఆటకు శ్రీకారం చుట్టారనే విమర్శ బలంగా వినిపించింది. కొన్ని నెలల క్రితం వైసీపీ అధిష్టానం ఇద్దర్నీ పిలిపించి రాజీ చేసి పంపింది. అయితే ఇది కూడా మూడు రోజుల ముచ్చటయింది.
ఎందుకంటే శివచంద్రారెడ్డికి బద్ధ వ్యతిరేకుల్ని ఎమ్మెల్యే రాచమల్లు ప్రోత్సహించడం మొదలు పెట్టారు. దీంతో వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఈ నేపథ్యంలో ఆ పంచాయతీలోని 13వ వార్డు సభ్యుడు మురళీధర్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో ఉపఎన్నిక వచ్చింది. సర్పంచ్ శివచంద్రారెడ్డి తన కుమారుడు హర్షవర్ధన్రెడ్డిని బరిలో నిలిపారు. మరోవైపు వైసీపీ మద్దతుదారుడిగా బ్రహ్మానందరెడ్డిని ఎమ్మెల్యే నిలబెట్టారు. ఈ ఎన్నిక ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వర్సెస్ కొత్తపల్లె సర్పంచ్గా మారింది. ఎమ్మెల్యే బామ్మర్ది, ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారురెడ్డి కొత్తపల్లె పంచాయతీలో మకాం వేశారు. ఈయన గారికి పేరుకు తగ్గట్టే ప్రొద్దుటూరులో చాలా గొప్ప పేరు వుందని జనం చెబుతుంటారు. 13వ వార్డులోని 1,172 మంది ఓటర్ల మనసు గెలుచుకునేందుకు ఇరువర్గాలు పూర్తిస్థాయిలో మోహరించాయి. ఎమ్మెల్యే వర్గానికి అధికారం, అంగబలం తోడయ్యాయి. మరోవైపు ప్రజల ప్రేమను సర్పంచ్ నమ్ముకున్నారు. హోరాహోరీ పోరు జరిగింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే వర్గం పెద్ద ఎత్తున ప్రలోభాలకు తెరలేపింది.