Shivaram Reddy: ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అయితే ఏపీలో ఇప్పటినుంచే ఎన్నికల వేడి మొదలైంది. పార్టీలన్నీ పొత్తులు, వ్యూహలపై ఫోకస్ పెట్టాయి. అభ్యర్థుల ఎంపికపై పార్టీలు ఫోకస్ పెట్టాయి. బలమైన నేతలు ఎవరు అనే దానిపై సర్వేలు నిర్వహిస్తున్నాయి. పార్టీ బలహీనంగా ఉన్న స్థానాలను గుర్తించి అక్కడ తమ బలాన్ని పెంచుకునేందుకు కసరత్తులు చేస్తున్నాయి. ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నేతలను తమ పార్టీలోకి రప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో ఏపీలో చేరికల రాజకీయం హాట్ టాపిక్ గా మారింది.
అధికార వైసీపీకి చెందిన పలువురు నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అధికార వైసీపీకి చెందిన కీలక నేత జనసేనలో చేరారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలానికి చెందని వైసీపీ నేత వుయ్యురు శివ రామిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. అనంతరం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. పవన్ సాదరంగా ఆయనను జనసేనలోకి ఆహ్వానించారు. జనసేన పార్టీలో చేరడం అనందంగా ఉందని శివరామిరెడ్డి తెలిపారు.
శివరామిరెడ్డి గతంలో టీడీపీ,ప్రజారాజ్యం పార్టీలలో పనిచేశారు. 1987 నుంచి ఆయన రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో మండల అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరి గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులుగా ఆ పార్టీలో పనిచేశారు. ఆ తర్వాత 2012 నుంచి వైసీపీ పార్టీలో కొనసాగుతున్నారు. అ ధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రజావ్యతిరేక విధానాలు ఆయనకకు నచ్చడం లేదు. దీంతో జనసేన పార్టీలో చేరినట్లు శివరామిరెడ్డి చెబుతున్నారు. వైసీపీకి చెందిన కీలక నేత గుడ్ బై చెప్పడంతో ఆ పార్టీకి షాక్ తగిలినట్లు అయింది. ఆయన వైసీపీకి రాజీనామా చేశారు.
ప్రస్తుతం తెనాలి నియోజకవర్గం నుంచి జనసేన నేతగా నాదెండ్ల మనోహర్ ఉన్నారు. తెనాలి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ గా కొనసాగుతున్నారు. ఇక 2019 ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి నాదెండ్ల మనోహర్ ఓటమి పాలయ్యారు. దీంతో జనసేనలో శివరామిరెడ్డికి ఎలాంటి బాధ్యతలు ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది.
ఏపీలో పార్టీ బలోపేతంపై పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టారు. పార్టీలోకి వచ్చేవారని సాదరంగా ఆహ్వానించారు. అలాగే ఇతర పార్టీ నుంచి వచ్చేవారికి తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. పార్టీ విధానాలు, సిద్దాంతాలు నచ్చి వచ్చేవారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇక ఏపీలో ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు మాత్రమే సమయం ఉండటంతో చేరికపై జనసేన ఫోకస్ పెట్టింది. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూనే.. మరోవైపు తిరుపతి నుంచి యాత్రకు పవన్ సిద్దమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బస్సు యాత్ర చేపట్టి పార్టీని బలోపేతం చేయనన్నారు.