Adimulam: తాజాగా ఏపీ అధికార పార్టీ వైసీపీ పై చిత్తూరు జిల్లా సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సొంత పార్టీ పైనే ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపాలో ఎస్సీలకు సరైన గౌరవం ఇవ్వడం లేదని మండిపడ్డారు. సత్యవేడు నియోజకవర్గ ఆత్మీయ సమావేశాన్ని మంత్రి పెద్దిరెడ్డి ఇంట్లో నిర్వహిస్తారా? అని ప్రశ్నించారు. నాకు ఇష్టం లేకపోయినా తిరుపతి ఎంపీ స్థానం ఇన్ఛార్జిగా ప్రకటించారు. చెవిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, రోజా స్థానాల్లో ఇలా ప్రకటించగలరా? అంటూ నిలదీశారు ఆదిమూలం. సత్యవేడులో మంత్రిపెద్దిరెడ్డి అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారని ఆరోపించిన ఆయన. అక్రమాలన్నింటినీ తనపై నెట్టేసి నియోజకవర్గం నుంచి నన్ను తప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే 1989లో మోటారు సైకిల్పై తిరిగిన పెద్దిరెడ్డి ఆస్తులు ఇప్పుడు ఎంత? మాజీ మంత్రి చెంగారెడ్డిని అడిగితే ఆయన అప్పటి ఆస్తుల గురించి చెబుతారు. నాకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేసింది పెద్దిరెడ్డే. ఇటీవల సీఎం నన్ను పిలిపించారు. అన్నా మీరు ఎంపీగా పోటీ చేయాలన్నారు. నేనేం తప్పు చేశాను. ఎంపీగా ఎందుకు పంపుతున్నారని అడిగాను. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడానికి రెండు కారణాలు చెప్పాలని అడిగాను అని ఆదిమూలం తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలోని 175 స్థానాల్లో సత్యవేడు ప్రశాంతంగా ఉంది. అధికార, విపక్ష నేతల్లో ఎవరిపైనా కేసులు నమోదు కాలేదు. ఎవరిపై ఫిర్యాదులు వచ్చినా డీఐజీతో చెప్పి రాజీ చేయించాను.
నియోజకవర్గం ప్రశాంతంగా ఉండేందుకు పాటుపడ్డాను. నాకు ఇష్టం లేకపోయినా తిరుపతి ఎంపీగా వెళ్లాల్సిందే అన్నారు. రెండు నెలలుగా ఈ అంశంపై హింస పెట్టారు. ఎంతో బాధపడ్డాను అని ఆదిమూలం మీడియా ఎదుట వాపోయారు. అలా ఆదిమూలం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి